చౌటుప్పల్ రూరల్, ఫిబ్రవరి 6 : కారులో మత్తు పదార్థ్ధాలు తరలిస్తున్న ఇద్దరిని చౌటుప్పల్ మండలం రెడ్డిబావి వద్ద 65వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.46.50 లక్షల విలువైన 100 కిలోల గంజాయి, 10 ప్యాకెట్ల ఆశిష్ ఆయిల్ ప్యాకెట్లతోపాటు 3 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో డీసీపీ నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు.
కేరళలోని కాసరగఢ్ జిల్లా పైవైలికా గ్రామానికి చెందిన మహ్మద్ అన్సార్ (19), కర్ణాటకలోని మంగళూరు జిల్లా కిన్యా గ్రామానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ హాసైనర్ (42) కేరళలోని కున్జీతూర్ గ్రామానికి చెందిన ఫైజల్ (ప్రధాన నింధితుడు) సూచన మేరకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా లంబసింగిలో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయి, ఆశిష్ ఆయిల్ కొనుగోలు చేసి స్విఫ్ట్డిజైర్ కారు (కేఏ14సీ2477)లో కేరళకు బయల్దేరారు.
మరో కారులో నలుగురు వ్యక్తులు ఈ కారుకు పైలెటింగ్గా వచ్చారు. మత్తు పదార్థ్ధాలు ఉన్న కారుకు పైలెట్ కారుకు మధ్య 10 -15 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డుపై ఎక్కడైనా పోలీసులు తనిఖీలు చేస్తే వెనుక వస్తున్న కారులోని వారిని పైలెట్ కారులోని వారు అప్రమత్తం చేస్తారు. కేరళలోని కాసరగఢ్కు చెందిన కారు డ్రైవర్ కబీర్, షేక్ అబ్దుల్లా, కర్ణాటకలోని బెంగళూర్కు చెందిన మూర్తి, అదే రాష్ట్రం మంగళూరు తాలుకా తాలావడి గ్రామానికి చెందిన నౌషాద్ పైలెటింగ్కు వచ్చారు. స్విఫ్ట్ డిజైర్ కారులోని అన్సార్, హాసైనర్ పోలీసులకు పట్టుబడడంతో వారు పరారయ్యారు.
ప్రధాన నిందితుడు ఫైజల్ సైతం పరారీలో ఉన్నారు. గతంలోనూ వీరు లంబసింగి నుంచి రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, మంగుళూరు ప్రాంతాల మీదుగా కేరళకు గంజాయిని తరలించినట్లు పోలీసుల విచారణలో గుర్తించారని డీసీపీ తెలిపారు. గంజాయిని పట్టుకున్న రామన్నపేట సీఐ మోతీరాం, ఎస్ఐ అనిల్, పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ ఉదయ్రెడ్డి, సీఐ వెంకటయ్య పాల్గొన్నారు.