నిడమనూరు, ఫిబ్రవరి 6 : కష్టసుఖాల్లో కడదాకా తోడుగా ఉండాల్సిన భర్త.. భార్యను గొడ్డలితో నరికి పాశవికంగా హతమార్చాడు. మద్యానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతుల పహాడ్ గ్రామంలో ఆదివారం ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. బొక్కమంతుల పహాడ్ గ్రామానికి చెందిన దర్మారపు రుద్రయ్యకు నల్లగొండ మండలం పానగల్లుకు చెందిన రాజేశ్వరికి 16 ఏండ్ల క్రితం వివాహమైంది. వీరికి లక్ష్మీనారాయణ (15), గణేశ్ (8) సంతానం. గతేడాది చిన్న కుమారుడు గణేశ్ అనారోగ్యంతో మృతి చెందాడు. నాటి నుంచి రుద్రయ్య మానసికంగా బాధపడుతూ మద్యానికి బానిసయ్యాడు.
ఈ క్రమంలో ఆర్థ్ధికంగా చితికిపోవడంతో కొంతకాలంగా హైదరాబాద్లోని నాగోల్ సాయినగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో దంపతులిద్దరూ పని చేస్తున్నారు. రుద్రయ్య అన్న వెంకన్న ఇంట్లో శుభకార్యం ఉండడంతో ఆదివారం బొక్కమంతుల పహాడ్ వచ్చారు. చాలారోజుల తరువాత స్వగ్రామానికి రావడంతో రాజేశ్వరి ఇంటిని శుభ్రం చేస్తున్నది. సోదరుడు వెంకన్న ఇంటికి వెళ్లి వచ్చిన రుద్రయ్య భార్య రాజేశ్వరిని మద్యానికి డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఆమె నిరాకరించడంతో తీవ్ర కోపోద్రిక్తుడై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఆమె కొట్టుమిట్టాడుతుండడంతో రుద్రయ్య పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితురాలిని మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాగార్జున సాగర్ సీఐ గౌరీనాయుడు తెలిపారు.