నార్కట్పల్లి, ఫిబ్రవరి 6 : యాదాద్రి తరహాలో చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని చెర్వుగట్టు ఆలయంలో రూ.7కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులను ఆదివారం ఆయన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయాభివృద్ధికి ప్రతిఒక్కరూ పాటుపడాలని సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రొటోకాల్ పాటించాలని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అభివృద్ధిలో ఈఓ క్రియాశీలక బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రొటోకాల్ విషయంలో ఈఓపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, ఆలయ చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి, సర్పంచ్ మల్గ బాలకృష్ణ, బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు చూసి టీఆర్ఎస్లోకి వలసలు
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని బాజకుంట గ్రామానికి చెందిన పలు కుటుంబాలు ఆదివారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఉపేక్షించవద్దు
కలెక్టర్, ఎస్పీకి మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశం
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఎవరినీ ఉపేక్షించవద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్కు సూచించారు. గతంలో ఈ తరహా ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం సుమోటోగా తీసుకొని విచారించి అక్రమార్కులను కటకటాల వెనక్కి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్లపై తాజాగా వస్తున్న ఆరోపణలపై పూర్తి స్తాయిలో విచారించాలని పేర్కొన్నారు. విచారణలో దోషులని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.