కట్టంగూర్(నకిరేకల్), ఫిబ్రవరి 6 : గొర్రెల పంపిణీ, సంపదలో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. ఆదివారం రాత్రి తన స్వగ్రామం నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల మంద లబ్ధిదారులతో ముచ్చటించి పల్లె నిద్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కుల వృత్తులకు చేయూత అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు.
గొల్ల కురుమలు ప్రభుత్వం అందించిన గొర్రెలు పెంచుతూ ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని తెలిపారు. గొల్ల కురుమలకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ ఉండాలనే గట్టి సంకల్పంతో సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సహకారంతో గొల్ల కురుమల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తనకు సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు. తన పదవికి న్యాయం చేస్తానని, ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.