నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికల నిర్వహణకు ఈ నెల 7న నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు పాతా తాలుకా కేంద్రమైన చండూరు తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు వ్యవహారించనున్నారు. తాసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి నామినేషన్ల దాఖలు చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉప సంహరణ ప్రక్రియ మొత్తం ఇక్కడే జరుగనుంది. ఇక మరో వైపు ఇప్పటికే ఉప ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఈవీఎంలను సిద్ధం చేసి, చండూరులోని డాన్బాస్కో జూనియర్ కాలేజీలో భద్రపర్చాలని నిర్ణయించారు. పోలింగ్కు ముందు రోజు ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేయనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం కూడా ఇక్కడికి ఈవీఎంలను తరలించి అక్కడి నుంచి నల్లగొండలోని ఆర్జాలబావిలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాంలో భద్రపర్చనున్నారు. వచ్చే నెల 6న కౌంటింగ్ కూడా ఇక్కడే చేపట్టనున్నారు.
ఎన్నికల కోడ్ అమలుకు ప్రత్యేక బృందాలు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం విస్తరించి ఉన్న నల్లగొండ, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను సైతం నియమించారు. వీరితో మంగళవారం కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి చండూరులో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కోడ్ ఉల్లంఘన జరుగకుండా పకడ్బందీగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నోడల్ అధికారులు, ఎంసీసీ, ఫ్లయింగ్ స్కాడ్లు, ఎస్ఎస్టీ, వీఎస్టీ బృంద సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే విభాగాల వారీగా నోడల్ అధికారులను నియమించారు. ఎన్నికల ప్రచార వాహనాలకు ఆర్ఓ నుంచి అనుమతి తీసుకోవడంతో పాటు ర్యాలీలు, సభలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్ల నిర్వహణకు డీఎస్పీ నుంచి అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. ప్రత్యేక చెక్పోస్టుల ద్వారా డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు చెక్ పెట్టేలా కూడా చర్యలు చేపడుతున్నారు.
త్వరలో ఓటర్ల తుది జాబితా.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నూతన ఓటర్ల దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది. అదనంగా 26 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం వీటికి ఆమోదం తెలుపనున్నారు. ఈ ప్రక్రియకు నామినేషన్లు ముగిసే 14వ తేదీ నాటికి ఓటర్ల తుది జాబితాపై స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 2,27,202 మంది ఓటర్లు ఉండగా వీరికి అదనంగా నూతన ఓటర్లు జత కానున్నారు. మునుగోడు ఉపఎన్నిక అం దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో నూతన ఓటర్ల దరఖాస్తులు కూడా పెద్దసంఖ్యలో వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి దరఖాస్తునూ జాగ్రత్తగా పరిశీలించిన అనంతరమే క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్
చండూరు : వచ్చే నెలలో జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం చండూరులోని డాన్బోస్కో కళాశాలలో ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు విధి విధానాలను వివరించారు. నియోజకవర్గంలో మొత్తం 14 ఫ్ల్లయింగ్ స్కాడ్ బృం దాలు, 6 చెక్పోస్టులు, 6వీడియో సర్వేలేన్స్ టీంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ బృందాలు 24 గంటలు పర్యవేక్షిస్తాయన్నారు. అధికారులు సమన్వయంతో విధులను నిర్వర్తించి ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, భాస్కర్రావు, ఈఆర్ఓ జగన్నాథరావు, డీఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల తాసీల్దార్లు, ఎంపీడీఓలు, పాల్గొన్నారు.