నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మునుగోడుతో పాటు పలు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం సరిగ్గా నెల రోజుల్లో వచ్చే నెల 3న పోలింగ్ జరుగనుంది. గత ఎన్నికల్లో మునుగోడులో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన కుటుంబ కాంట్రాక్టుల కోసం అభివృద్ధ్ది వంకపెట్టి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో విస్తరించాలన్న లక్ష్యంతో ఇప్పటికే అనేక కుయుక్తులకు పాల్పడుతున్న బీజేపీ, తన విస్తరణ ఆటలో పావుగా రాజగోపాల్రెడ్డిని ఎంచుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ పెద్దల ఒత్తిడితో ఆగస్టు 8న రాజగోపాల్రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా అదే రోజు స్పీకర్ ఆమోదించడంతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. అప్పటి నుంచి మునుగోడులో రాజకీయ హడావుడి మొదలైంది. దేశవ్యాప్తంగా మోదీ సర్కార్పై పోరాటానికి సిద్ధ్దమవుతున్న టీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదని ఈ ఉప ఎన్నిక ద్వారా చాటిచెప్పాలన్న బలమైన సంకల్పంతో ఉంది. ఈ నేపథ్యంలో పకడ్బందీగా ముం దుకు సాగుతుంది.
బీజేపీ పోరులో కలిసి వచ్చేందుకు సిద్ధ్దంగా ఉన్న సీపీఎం, సీపీఐను కూడా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కలుపుకుని ఎన్నికల సమరానికి సై అంటుంది. ఇక తన సిట్టింగ్ స్థానమైన మునుగోడును తిరిగి నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ కూడా సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధ్దమైంది. ఇప్పటికే తమ అభ్యర్థ్ధిగా దివంగత సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి కూతురు స్రవంతిని అభ్యర్థ్ధిగా ప్రకటించింది. ఇక అవసరం లేకున్నా ఉపఎన్నికను మునుగోడు ప్రజలపై బలవంతంగా రుద్దుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ, రాజగోపాల్రెడ్డి ద్వారా ఒక ప్రయోగానికి సిద్ధమైంది. గెలుపు సాధ్యం కాదని భావిస్తున్న ఆ పార్టీ కాంగ్రెస్ను మూడో స్థానంలోకి నెట్టడం ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. దాంతో ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయడంలో సందేహం లేదు. షెడ్యూల్ విడుదలకు ముందు నుంచి ఎవరికీ వారే ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఓటర్లలోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన ప్రధాన నేతలంతా నియోజకవర్గంలోనే చక్కర్లు కొడుతున్నారు.
2018లో ఎన్నికల ఫలితాలు ఇవి..
2018 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థ్ధి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మీద కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డికి 97,239 ఓట్లు రాగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి 74,687 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీజేపీ బలం నామామాత్రమేనని ఆ ఎన్నికల్లో మరోసారి స్పష్టమైంది. బీజేపీ అభ్యర్థ్ధిగా బరిలో ఉన్న గొంగిడి మనోహర్రెడ్డికి కేవలం 12,725(6 శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి. 2018లో మొత్తం 2,17,760 మంది ఓటర్లు ఉండగా అందులో ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 91.07 శాతం పోలింగ్తో 1,98,308 ఓట్లు పోలు కావడం విశేషం. చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు, చండూర్, మర్రిగూడ, నాంపల్లి మండలాలతో కూడిన మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం 2,27,202 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,15,463, మహిళలు 1,11,735 మంది, మరో నలుగురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. నోటిఫికేషన్ జారీ నాటికి తుది ఓటర్ల జాబితాను కూడా ప్రకటించ నున్నారు. ఈ సారి ఉప ఎన్నిక కావడం, ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో పోలింగ్ శాతం మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
అమలుల్లో ఎన్నికల కోడ్…
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై సోమవారం నల్లగొండ కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. మోడల్ కోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలపై ఎలాంటి ఎన్నికల ప్రచార రాతలు రాయకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు కొత్తగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని ఆదేశించారు. ప్రభుత్వ అతిథి గృహాలు, వాహనాలను ఎన్నికల ప్రచారానికి వాడకూడదని సూచించారు. నవంబర్ 8 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 7న నోటిఫికేషన్, 14 వరకు నామినేషన్ల స్వీకరణ, 15న పరిశీలన, 17న నామినేషన్ల ఉప సంహరణ గడువు, నవంబర్ 3న పోలింగ్, 6న కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కోడ్కు అనుగుణంగానే అన్నీ పార్టీలు తమ ప్రచారాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
ఎన్నికల సామగ్రి భద్రత కేంద్రం పరిశీలన
చండూరు : మండలకేంద్రంలోని డాన్ బోస్కో కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, ఈవీఎంలను భద్రపరిచే గదులను నల్లగొండ ఆర్డీఓ జగన్నాథరావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది సిద్ధ్దంగా ఉండాలన్నారు. తాసీల్దార్ గణేశ్, ఎలక్షన్ డిప్యూటీ తాసీల్దార్ దీపక్ పాల్గొన్నారు.