సిటీబ్యూరో(నమస్తే తెలంగాణ), ఆలేరు, అక్టోబర్ 3: ఒడిశా సరిహద్దు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 900 కిలోల గంజాయి రూ.2 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన యోగేశ్ దత్తు గైక్వాడ్ ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఒడిశాలోని మల్కాన్గిరిలో గంజాయి సరఫరా చేసే కర్రెయ్యను కలిసి ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన వికాస్ బాబన్ సాల్వే, వినోద్ చంద్రవంకల్కర్, కిశోర్ తులసీరామ్ వాడేకర్, కోస చిట్టిబాబు కలిసి గ్యాంగ్గా ఏర్పడ్డారు. వారం రోజుల క్రితం గైక్వాడ్ ఆదేశాలతో మహారాష్ట్ర నుంచి డీసీఎంలో ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం చేరుకున్నారు. అక్కడ కొబ్బరి బొండాలను డీసీఎంలో నింపుకున్నారు. అక్కడ నుంచి ఒడిశా సరిహద్దులోని మల్కాన్గిరికి వెళ్లి, అక్కడ కర్రయ్యను కలిసి గంజాయి ప్యాకెట్లను డీసీఎంలో కొబ్బరి బొండాల కింద పెట్టారు. ఈ గ్యాంగ్కు చిట్టి బాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు దారి చూపిస్తుండగా మిగిలిన ముగ్గురు కూడా డీసీఎంలోనే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఎల్బీ నగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్ట్టర్ సుధాకర్ బృందానికి వచ్చిన సమాచారంతో, ఆలేరు పోలీసులతో కలిసి ఆలేరు చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో డీసీఎం తనిఖీ చేయగా 900 కిలోల గంజాయిని స్వాధీనం వాహనంలో ఉన్న వికాస్ బాబన్, వినోద్, కిశోర్, కోస చిట్టిబాబులను అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడు గైక్వాడ్, కర్రయ్య పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద ఐచర్(డీసీఎం), ఐదు మొబైల్స్, రూ.3,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.