పెద్దవూర, ఫిబ్రవరి 4:పెద్దవూర మండలంలోని బట్టుగూడెం గ్రామ శివాలయం ఆధ్యాత్మికతకు నిలయమై విరాజిల్లుతున్నది. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం కాలగమనంలో ఆనవాళ్లు కోల్పోయింది. గ్రామస్తులు, దాతల సహకారంతో ఉప ఆలయాల నిర్మాణం చేపట్టి పూజలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధూప, దీప, నైవేద్య పథకం వర్తింపజేయడంతో నిత్య పూజలకు ఇబ్బంది లేకుండా పోయిందని అర్చకులు చెప్తున్నారు. ఆలయ ఆవరణలో కొత్త రాతియుగం, ఇనుప యుగం, శాతవాహన, రాష్ట్ర కూటులు, కాకతీయుల కాలం నాటి శాసనాలు, శిల్ప కళ ఉన్నట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి తెలిపారు.
వైభవంగా శివరాత్రి ఉత్సవాలు..
అతి ప్రాచీన శివాలయం కావడంతో ఏటా శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు, దాతల సహకారంతో జాతరను నిర్వహంచడం సంప్రదాయంగా కొనసాగుతున్నది. అతి పురాతన నంది విగ్రహం చూడ ముచ్చట గొల్పుతుంది. జీవకళ ఉట్టిపడేలా ఈ విగ్రహం కనిపించడం అద్భుతమనే చెప్పొచ్చు. శివరాత్రి సందర్భంగా జాతీయస్థాయి ఎద్దుల పందేలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. గ్రామానికి శివాలయం నైరుతి దిక్కున ఉండటంతో శివుడు ఆశీస్సులతో గ్రామంలో పాడి పంటలు బాగా వృద్ధి చెందుతున్నాయని గ్రామస్తులు విశ్వసిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దాతలు సహకరించి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మహిమగల ఆలయం..
శివాలయం అతి పురాతనమైనది. మా తాత, ముత్తాతలు సైతం ఈ ఆలయంలో పూజలు చేశారు. అదే ఆనవాయితీని మేము కొనసాగిస్తున్నాం. బట్టుగూడెం శివాలయం మహాశక్తివంతమైన ఆలయం అని మా పూర్వీకులు చెప్తుంటారు. ఇక్కడ పూజలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తుంటాం. గతంలో గ్రామస్తులు చందాలు పోగు చేసి ఏటా కొంత నగదు ఇచ్చేవారు. రాష్ట్ర ప్రభుత్వం ధూప, దీప, నైవేద్య పథకంలో ఎంపిక చేయడంతో ప్రస్తుతం నిత్య పూజలకు ఎలాంటి ఇబ్బందీ లేదు.
– సూరిభట్ల అనంతశర్మ, అర్చకుడు
దాతలు, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి
శివాలయాన్ని మా తాతల కాలం నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. దాతలు, గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేస్తూ చాలా వరకు పూర్తి చేశాం. ఆలయానికి ప్రహరీ నిర్మించడంతో పాటు చుట్టూ పచ్చని మొక్కలు నాటించి పరిరక్షణకు సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాతలు మరింతగా సహకరిస్తే మిగిలి ఉన్న పనులు పూర్తి చేయించి శివరాత్రి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం.
– నక్కల నాగిరెడ్డి, గ్రామస్తుడు