చండూరు(గట్టుప్పల్), సెప్టెంబర్ 30 : ఎంతో కాలంగా ఎదురుచూసిన గట్టుప్పల్వాసుల కల నేడు నెరవేరుతున్నది. సమైక్య రాష్ట్రంలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా అమలుకు నోచుకోని స్వప్నం నేడు నెరవేరుతున్నది. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో గట్టుప్పల్ మండల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చుట్టుపట్టు గ్రామాల ప్రజల ఆనందానికి అవధుల్వేకుండా పోయాయి. అధికారులు ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ భవనాల ఎంపిక పూర్తి చేస్తుండడంతో ఇన్నాళ్లకు తమ కల నెరవేరబోతుందన్న సంతోషం వారి కండ్లల్లో కనిపిస్తున్నది. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం ఆర్డీఓ జగన్నాథరావు గట్టుప్పల్లో ఏర్పాటు చేయనున్న తాసీల్దార్ కార్యాలయం ఏర్పాట్లను పరిశీలించారు. సీఐ అశోక్రెడ్డి నూతనంగా ఏర్పాటు చేయనున్న పోలీస్ స్టేషన భవనాన్ని పరిశీలించి ముస్తాబు చేయించారు. మండలంలో నూతన కార్యాలయాల ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించనున్న సభాస్థలిని సర్పంచ్ ఇడెం రోజా పరిశీలించారు.
8 గ్రామాలతో మండలం.. గట్టుప్పల్తోపాటు మరో 7 గ్రామాలను కలిపి మొత్తం 8 గ్రామ పంచాయతీలతో మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చండూరు మండలంలోని గట్టుప్పల్, తెరటుపల్లి, కమ్మగూడెం, శేరిగూడెం, మునుగోడు మండలంలోని వెల్మకన్నె, మర్రిగూడ మండలంలోని అంతంపేట, నామాపురం, సోమరాజుగూడ గ్రామాలతో మండలం ఏర్పడనుంది.
సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు
గట్టుప్పల్ మండలం హామీని నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి కేసిఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు. ఇంతకాలం ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరిన్ నీళ్లు తాగుతూ తీవ్ర ఇబ్బందులు పడేవారు. మునుగోడు నియోజకవర్గానికి సాగు, తాగు అందివ్వడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.
-మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల
మండల ఏర్పాటు సంతోషకరం
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుకాబోతున్న నూతన మండలాల జాబితాలో మా గ్రామం ఉండడం సంతోషకరం. నేను సర్పంచ్గా ఉన్నప్పుడే మా ఊరు మండల కేంద్రంగా రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందదాయకం. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు, మండలం కోసం కృషిచేసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి ధన్యవాదాలు.
– ఇడెం రోజా, సర్పంచ్, గట్టుప్పల్