జిల్లాలో మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా వర్షం భారీగా పడింది. అత్యధికంగా తుంగతుర్తి మండలంలో 10.58 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
తుంగతుర్తిలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్లు
సూర్యాపేటలో లోతట్టు ప్రాంతాలు జలమయం
సూర్యాపేట, సెప్టెంబర్ 29 : జిల్లాలో మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా వర్షం భారీగా పడింది. అత్యధికంగా తుంగతుర్తి మండలంలో 10.58 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మద్దిరాల, కోదాడ, అనంతగిరి మండలాల్లో మాత్రమే చిరు జల్లులు పడగా ఇతర మండలాల్లో సెంటీమీటర్కు పైగానే వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలల్లోకి వర్షం నీరు వచ్చి చేరడంతో ప్రజలు కొంత ఇబ్బందులకు గురయ్యారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 102.73 సెంటీమీటర్లు పడగా 23 మండలాల పరిధిలో సగటున 4.47 సెంటీమీటర్ల మీటర్ల వర్షం పడింది. సాధారణంగా సెప్టెంబర్ నెలలో 15.27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుండగా ఈ ఏడాది ఇప్పటి వరకు 14.46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మండలాల వారిగా వర్షపాతం వివరాలు.. తుంగతుర్తిలో 10.58 సెంటీమీటర్లు, ఆత్మకూర్(ఎస్)-9.32, చివ్వెంల-9.22, నాగారం-7.34, పెన్పహాడ్-7.21, నడిగూడెం-7.01, మోతె-6.59, జాజిరెడ్డిగూడెం-6.18, నేరేడుచర్ల-6.13, సూర్యాపేట-5.60, మునగాల-5.56, తిరుమలగిరి-4.61, చిలుకూరు-3.60, మఠంపల్లి-2.67, పాలకవీడు-2.63, గరిడేపల్లి-2.36, హుజూర్నగర్-1.46, నూతనకల్-1.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు అయింది.
లోతట్టు ప్రాంతాల పరిశీలన
బొడ్రాయిబజార్ : సూర్యాపేట పట్టణాన్ని వర్షం ముంచెత్తింది. భారీ వరద ఉధృతి కొనసాగడంతో లోతట్టు ప్రాంతాలు, నాలా పరిసరాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణాశ్రీనివాస్, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి వరద నీటిని పంపించే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పట్టణంలోని 36, 37 వార్డుల్లో భారీగా వరదనీరు నిలువడంతో జేసీబీతో పలుచోట్ల గండ్లు కొట్టించి నీటిని పంపించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందొద్దని, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో వరద ప్రమాదాన్ని నిర్మూలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు గండూరి ప్రకాశ్, పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు పాల్గొన్నారు.
పెన్పహాడ్లో వర్ష భీభత్సం
పెన్పహాడ్ : మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పెద్ద ఎత్తున అలుగులు పోస్తున్నాయి. వరద ఉధృతికి పలుచోట్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి. చీదెళ్లలో పెద్ద చెరువు నీటి ఉధృతికి మాదారం రహదారి పూర్తిగా దెబ్బతిన్నది. వాహనదారులు, పాదచారులు వెళ్లలేని పరిస్థితి.
అర్వపల్లిలో జోరు వాన
అర్వపల్లి : మండల వ్యాప్తంగా జోరు వాన కురిసింది. ఎస్సారెస్పీ జలాలతో గ్రామాల్లోని చెరువులు పూర్తిగా నిండి అలుగులు పోస్తుండడంతో రాత్రి పడ్డ వర్షంతో పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల వరి పొలాలను వరద నీరు ముంచెత్తింది.
ఇంటిపై పిడుగు
దేవరకొండ : పట్టణంలోని ఆయప్పనగర్ తుల్చమ్మకుంట సమీపంలో కొర్ర దేవానాయక్ ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఎలివేషన్ గొడకు రంద్రం పడడంతో పాటు ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు.
నల్లగొండ జిల్లా అంతటా వర్షం
నల్లగొండ : జిల్లా అంతటా రెండు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి. అత్యధికంగా దేవరకొండలో 7.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కొద్ది రోజులు వర్షాలు లేక ముఖం చాటేసిన మెట్ట పంటలకు తాజాగా కురిసిన వర్షం ఎంతో ఉపశమనం కలిగించింది. నాంపల్లిలో 5.01 సెంటీమీటర్లు, మర్రిగూడ-4.81, నేరేడుగొమ్ము-4.23, తిరుమలగిరి సాగర్-3.75, కొండమల్లేపల్లి- 3.35, మాడ్గులపల్లి-3.25, కేతేపల్లి-31.3, చండూర్-3.03, చందంపేట-2.53, చింతపల్లి 2.37, గుర్రంపోడు 2.10, దామరచర్ల-1.97, తిప్పర్తి-1.97, గుండ్లపల్లి-1.80, కనగల్-1.78, పెద్దవూర-1.71, శాలిగౌరారం 1.68, మిర్యాలగూడ 1.59, పీఏ పల్లి 1.48, నకిరేకల్ 1.04, వేములపల్లి-1.04, అడవిదేవులపల్లి-1 సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. త్రిపురారంలో 8.3 మీల్లిమీటర్లు, చిట్యాలలో 7.7, నల్లగొండ-7.1, నార్కట్పల్లి-6.9, కట్టంగూర్-6.4, నిడమనూరు-5.9, అనుముల-4.7 మిల్లీమీటర్లు వర్షం పడగా అత్యల్పంగా మునుగోడులో 4.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఆయా మండలాల్లో 67.53 సెంటీమీటర్లు వర్షం పడగా 2.18 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో 50.81 సెంటీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 59.28 సెం.మీ. వర్షం పడడంతో 17 శాతం అదనంగా నమోదు అయింది.