వయసు పైబడిన వృద్ధులకు పెద్దకొడుకులా.. శరీర అవయవాలు సహకరించని దివ్యాంగులకు ఆప్తుడిలా.. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన వింతంతువులకు అన్నలా.. ఒంటరి మహిళలకు తోబుట్టువుగా.. నేతన్నలు, బీడి, గీత కార్మికులకు కుటుంబీకుడిగా.. పైలేరియా, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆపద్బాంధవుడిగా సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు ఇస్తూ అండగా నిలుస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు ఇస్తూ భరోసా కల్పిస్తున్నారు. గత పాలకులకు భిన్నంగా స్వరాష్ట్రంలో లబ్ధిదారులను ఆదుకుంటున్నారు. ఏ ఒక్కరూ బాధపడకూడదని వారి కష్టాలను తీరుస్తున్నారు. ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 5,07,231మందికి పింఛన్లు ఇస్తూ కొండంత బలాన్ని నింపుతున్నారు. తెలంగాణ ఆసరా దేశమంతా కావాలని పింఛన్ దారులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక్కకేసీఆర్తోనే సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆశీర్వదిస్తున్నారు.
మోదీ పాలనలో సామాన్యులపై పెనుభారం..
మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ, సెస్సు విధిస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడంతో సామాన్యులపై పెనుభారం పడింది. వారి జీవనం కష్టతరంగా మారింది. దాంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రజలు విసుగు చెందుతున్నారు. ప్రత్యామ్నాయ నేతలు, పార్టీల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రారంభిస్తుండడంపై యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తుంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో సంక్షేమ పాలన కొనసాగుతూ ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మారడం.
ఉమ్మడి జిల్లాలో 5,07,231మందికి పింఛన్లు..
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అన్నింటా అన్యాయమే జరిగింది. నిధులన్నీ ఆంధ్రాకే తరలించుకుపోయారు. కనీసం పింఛన్లు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. తెలంగాణ ఏర్పడ్డాక ఈ పరిస్థితి మారింది. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ రూ.200 ఉన్న పింఛన్ను ఏకంగా రూ.2,016కు పెంచారు. దివ్యాంగులకు రూ.500 ఉన్న పింఛన్ 3,016 ఇస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,07,231 మందికి పింఛన్లు నెలనెలా వస్తున్నాయి. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,14,894, నల్లగొండలో 2,28,866, సూర్యాపేటలో 1,63,471 మందికి పింఛన్లు అందుతున్నాయి. ఇక బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకొనే గుజరాత్లో ఇప్పటికీ నెలకు రూ.600 పింఛన్ మాత్రమే ఇస్తుండటం గమనార్హం.
57 ఏండ్లు నిండినోళ్లకు కూడా..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దాకా 65 ఏండ్లు నిండినోళ్లకే పింఛన్లు అందించింది. గతంలో 57 ఏండ్లు నిండినోళ్లకు కూడా ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం వీరికి కూడా పింఛన్ ఇస్తున్నారు. దాంతో వృద్ధులు ఎంతో సంతోషిస్తున్నారు. నెలనెలా పింఛన్లు తమకు ఎంతో ఆసరా అవుతాయని, కేసీఆర్ మరోసారి తమ పాలనాదక్షతను నిరూపించుకున్నారని పల్లెల్లో అవ్వాతాతలు ప్రశంసిస్తున్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు సంతోషంగా జీవించాలని దీవెనలు ఇస్తున్నారు. ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, గీత, నేత, బీడీ, హెచ్ఐవీ, పైలేరియా, ఒంటరి మహిళలకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారు. ఇటీవల డయాలసిస్ పేషంట్లలో కొందరు వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సర్కారు ఇప్పటికే ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
నెలనెలా పింఛన్ ఇస్తున్న పెద్దకొడుకు కేసీఆర్ సార్
నెలనెలా రూ.2వేలు పింఛన్ ఇస్తున్న పెద్దకొడుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్. పింఛన్ డబ్బులు మందులు, ఇంట్లో సరుకులకు వాడుకుంటున్నా. గత పాలకులు కేవలం రూ.200మాత్రమే పింఛన్ ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కేసీఆర్ సీఎం అవడంతో పింఛన్లు పెంచి వికలాంగులకు రూ.3 వేలు, ఇతరులకు రూ.2 వేలు ఇస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం 57 ఏండ్లు వచ్చినోళ్లకు కూడా పింఛన్లు ఇస్తామనడంతో దరఖాస్తు పెట్టుకున్నా. ఇప్పుడు నాకు కూడా పింఛన్ మంజూరు చేశారు. నాలాంటి వారికి పింఛన్లు అందిస్తుండడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతున్నాయి. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు ఇలా అనేక మందికి పింఛన్లు అందిస్తుండడంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. సీఎం కేసీఆర్కు మేమంతా ఎల్లవేళలా అండగా ఉంటాం.
– పర్శనబోయిన సోమమ్మ, మొల్కపట్నం(వేములపల్లి)
కేసీఆర్ సార్ దేశాన్ని ఏలాలి
రాష్ట్రంలో పింఛన్దారులకు పెద్దకొడుకు లాంటి సీఎం కేసీఆర్ దేశాన్ని ఏలాలి. మా లాంటి ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి సార్ ప్రధానమంత్రి కావాలి. గతంలో రూ.200 ఉన్న పింఛన్ తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ రూ.2,016 ఇస్తుండు. పింఛన్ డబ్బులతో ఎవరిపై ఆధారపడకుండా నాలాంటి వారు ఎంతో మంది ఆత్మగౌరవంతో బతుకున్నారు. నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన గొప్ప మనసున్న మారాజు ముఖ్యమంత్రి సార్. మన దగ్గర ఇస్తున్న పథకాలను ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అయితే దేశంలో ఉన్న అర్హులందరికీ అన్ని రకాల పింఛన్లు వస్తయి. మా లాంటి వాళ్లను ఆదుకొని సీఎం కేసీఆర్ దేవుడయ్యాడు. పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్న ఆయన సల్లంగా ఉండాలి. కేసీఆర్ లాంటి వ్యక్తి దేశాన్ని ఏలితే దేశంలో మహిళలందరికీ భరోసా ఉంటుంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన వాళ్లకు అండగా ఉంటున్న కేసీఆర్ సార్ దేశ రాజకీయాల్లోకి పోవాలని కోరుకుంటున్నా.
-దాసరి వెంకమ్మ, ఈదులూరు(కట్టంగూర్)
దేశంలోని వృద్ధులందరికీ అండగా ఉంటడు
బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలంటే కేసీఆర్ సార్ ప్రధాన మంత్రి కావాలి. బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలతో సామాన్య ప్రజలపై మరింత భారం పడుతుంది. బీజేపీ ప్రభుత్వం వృద్ధులకు ఎలాంటి సాయం అందిస్తలేదు. వృద్ధులకు సాయం అందించాలనే ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి ఏనాడూ రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రంలో అందించే అన్ని రకాల పింఛన్లు అందిస్తే జనం బీజేపీని మరిచిపోతారు. రాష్ట్రంలో అందించినట్లుగానే దేశంలోని వృద్ధులందరికీ పింఛన్ అందించి వారికి అండగా ఉంటడు. -బుడుమ శివలింగం, మైలారం, పింఛన్దారుడు(భువనగిరి అర్బన్)
కేసీఆర్ సార్ దేశ నాయకుడు కావాలి
తెలంగాణ రాష్ట్రం వచ్చిన దగ్గరి నుంచి మాలాంటి పేదలకు ఇచ్చే పింఛన్ రూ.2000కు పెంచి నెలనెలా తప్పకుండా ఇస్తున్నారు. ఇలాంటి పింఛన్ దేశంలోని ప్రజలందరికీ అందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ నాయకుడు కావాలి. కేంద్రంలో ఉన్న బీజేపోళ్లు రైతుల మోటర్లకు మీటర్లు పెడ్తరంట. ఎనిమిదేండ్లుగా మా లాంటి బీదలకు వాళ్లు ఏమీ చేయలేదు. కేసీఆర్ సార్ రాదన్న తెలంగాణను తెచ్చి ఎన్నో పథకాలు పెట్టిండు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఎవుసానికి సరిపడా నీళ్లు, కరెంట్ ఇస్తుండు. ముసలోళ్లలకు రూ.2016, అవిటోళ్లకు రూ.3016 చొప్పున ఇస్తుండు. అంతేకాకుండా కేసీఆర్ సార్ అందరికీ ఏదో ఒకటి మంచే చేస్తుండు. ఆయన లాంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి ఎంతో అవసరం ఉంది. ఆయన దేశంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా.
-కాసర్ల సీతయ్య, ఆసరా పింఛన్ లబ్ధిదారుడు, లింగగిరి(హుజూర్నగర్ రూరల్)
కేసీఆర్తోనే దేశమంతా మన పథకాలు..
సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు సేవలందించేందుకు పూర్తిస్థాయిలో అర్హుడు. మన రాష్ట్రంలో పేదలకు అందుతున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేవు. మన పథకాలు దేశమంతా అమలు కావాలంటే సీఎం కేసీఆర్ సార్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే. కేసీఆర్ ప్రధాని అయితే దేశానికి వెన్నెముకలా మారుతాడు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి స్వరాష్ట్ర స్వప్నాన్ని నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మాలాంటి వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ పదింతలు పెంచి ఆదుకున్నడు. ఆ డబ్బులతో దర్జాగా జీవనం గడుపుతున్నాం. అవసరమైన మందులు కొనుగోలు చేస్తున్నాం. ఇతర అవసరాలు తీర్చుకుంటున్నాం. పెన్షన్దారులే కాకుండా రాష్ట్రంలోని వృత్తిదారులు, రైతులు, ఉద్యోగులను కూడా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నాడు. ఇలాంటి సీఎం దేశ రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే దేశంలో పేదరికం క్రమంగా తొలగిపోతుంది.
-సయ్యద్ ఫకీరుద్దీన్, ఆసరా పింఛన్ లబ్ధిదారుడు, భీమారం(కేతేపల్లి)
ఆసరా పింఛన్లు ఎంతో మందికి ఊరట
సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప యోధుడు సీఎం కేసీఆర్. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. గత ప్రభుత్వాల్లో పింఛన్దారులకు మొండి చెయ్యి చూపేవారు. చాలీచాలని ఆసరా అందేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2016 నుంచి 3016 అందిస్తున్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పింఛన్ ఇచ్చేది సీఎం కేసీఆర్కే ఒక్కరే. ప్రస్తుత దేశ రాజకీయాల్లో మార్పులు తప్పనిసరి అనిపిస్తుంది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి దేశంలో కీలకపాత్ర పోషించాలి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వృత్తిదారుల జీవనోపాధికి పథకాలు అమలు చేస్తున్న ఆయన దేశంలోనూ ఇలాంటి పథకాలు అమలు చేయాలి.
-బొబ్బలి శోభ, మహిళా సంఘం మండలాధ్యక్షురాలు(నాగారం)
సంక్షేమ పథకాల అమలులో ఆదర్శం సీఎం కేసీఆర్
దేశ వ్యాప్తంగా మరే ఇతర రాష్ర్టాల్లో అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారు. 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పింఛన్ పథకం వర్తింపజేయడంతో ఎంతో మందికి లబ్ధి చేకూరుంది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే సంక్షేమ పథకాలు మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుంది. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ లాంటి నేత అవసరం ఎంతైనా ఉంది. రైతులతోపాటు కార్మికులు, కర్షకులు ఆర్థికంగా బలోపేతం అవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ దేశ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం.
-కొండమీది యాదమ్మ, గుమ్మడవెల్లి(కొండమల్లేపల్లి)