సూర్యాపేటటౌన్, సెప్టెంబర్ 19 :ఆరు నుంచి 10 శాతానికి రిజర్వేషన్ల పెంపు,గిరిజన బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో గిరిజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి హామీ సంత్సేవాలాల్ బంజారా భవన్, కుమ్రంభీమ్ ఆదివాసీ భవన్ ప్రారంభంతో ఆనందంతో ఉన్నారు. అడవి బిడ్డల బతుకుల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సోమవారం నేరేడుగొమ్ము మండల కేంద్రంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో గిరిజనులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సంస్థాన్ నారాయణపురం, అడ్డగూడూరు, మఠంపల్లి,మర్రిగూడ, నల్లగొండ, తిరుమలగిరి సాగర్, ఆత్మకూర్.ఎస్, తుంగతుర్తిలోనూ క్షీరాభిషేకం నిర్వహించారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రానికి వచ్చి సంప్రదాయ నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
ఎన్నో యేళ్లుగా గిరిజనులు కంటున్న కల రిజర్వేషన్ పెంపును సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంత్ సేవాలాల్ మహారాజ్, కుమ్రం భీంతో సమానమని తెలంగాణ రాష్ట్ర గిరిజన రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్, సేవాలాల్ సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు, చివ్వెంల జడ్పీటీసీ సంజీవనాయక్ అన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంపు, గిరిజన బంధు హామీ, పొడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం, ఆదివాసీ, బంజారా భవనాల నిర్మాణం తదితర చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా గిరిజనులు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి చేరుకుని స్థానిక ఖమ్మం క్రాస్రోడ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ బతుకమ్మ చౌరస్తాకు చేరుకుని సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు. ర్యాలీ ఆద్యంతం గిరిజనుల సంప్రదాయ వేషదారణలో నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య అడుగడుగునా కేసీఆర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి నీరాజనాలు పడుతూ సాగింది. ఈ సందర్భంగా సంజీవనాయక్ మాట్లాడుతూ.. 4 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ను నాలుగు తరాల పాటు గుర్తుంచుకుంటామన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇస్తున్న పది శాతం రిజర్వేషన్ను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
10 శాతం రిజర్వేషన్పై కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడితే గిరిజనులమంతా ఏకమై పాతాళానికి తొక్కుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్నాయక్, యూనియన్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్-హైదరాబాద్ ఎన్.వెంకటేశ్వర నాయక్, చివ్వెంల ఎంపీపీ ధరావత్ కుమారీబాబూనాయక్, సర్పంచులు శంకర్, నాగరాజు, భిక్షం, నాగేందర్, వెంకన్న, అనిల్, బికారి, సాగర్, వాంకుడోతు వెంకన్ననాయక్, టీఆర్ఎస్ పట్టణ ప్రచార కార్యదర్శి భుక్యా విజయానాయక్, గిరిజన నాయకులు నాగూనాయక్, బాబూనాయక్, రాజేశ్నాయక్, పాండూనాయక్, లచ్చిరాంనాయక్, సేవాలాల్ సేన, బంజారా సేవా సంఘం, బీఆర్ఎస్ఎస్, తెలంగాణ ఎరుకల సంఘం నాయకుడు రాజేందర్ పాల్గొన్నారు.