రామగిరి, సెప్టెంబర్ 19 :తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్పీఈసెట్-2022)కు మహాత్మాగాంధీ యూనివర్సిటీ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఐదు సంవత్సరాలు విజయవంతంగా పీఈసెట్ చేపట్టిన ఎంజీయూ ఆరోసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 21న 5 జిల్లాల్లోని 6 పరీక్ష కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,632 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఒకే రోజు పురుషులు, మహిళలకు వేర్వేరుగా పరీక్షలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. ఎంజీయూలో ఈవెంట్స్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. అన్ని ప్రాంతాల్లో పరీక్షలు ఉదయం 7గంటలకు మొదలవుతాయి.
తెలంగాణలోని యూజీ డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘టీఎస్పీఈసెట్-2022’ బాధ్యతను రాష్ట్ర ఉన్నత విద్యామండలి నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అప్పగించింది. బుధవారం ఐదు జిల్లాల్లోని 6 పరీక్ష కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఈవెంట్స్(క్రీడలను) పురుషులు, మహిళలకు వేర్వేరు ప్రాంతాలో ఒకే రోజులో పూర్తి చేయనున్నారు. అన్ని ప్రాంతాల్లో పరీక్షలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి.
ఎంజీయూ క్రీడా మైదానాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు
టీఎస్ పీఈసెట్ నిర్వహణకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని క్రీడామైదానాలు సిద్ధం చేశారు. సామాజిక దూరంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు వీసీ, కన్వీనర్ల ఆదేశాలతో యూనివర్సిటీ హాస్టల్స్లో బసచేయడానికి సైతం ఎంజీయూ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి డా. జి.ఉపేందర్రెడ్డి, ఎంజీయూ పీడీలు డా॥ వై. శ్రీనివాస్రెడ్డి, డా॥ ఆర్.మురళీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3,632 దరఖాస్తులు
టీఎస్ పీఈసెట్-22కి రాష్ట్ర వ్యాప్తంగా 3,632 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం నాటికి 3,552 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోగా (వీరిలో యూడీ డీపీఈడీకి 1,487మంది( పురుషులు 889, స్త్రీలు 598),బీపీఈడీకి 2,035(పురుషులు 1,239, స్త్రీలు 796)అభ్యర్థులు ఉన్నారు. ఇంకా 92 మంది హాల్టికెట్స్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉండగా పరీక్ష కేంద్రాల వారీగా విద్యార్థుల సంఖ్యలో మార్పులు జరుగనున్నట్లు తెలుస్తున్నది. ఉదయం 7గంటల నుంచి ఫిజికల్ ఈవెంట్స్ బ్యాచ్ వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పరీక్ష కేంద్రాల్లో ప్రారంభమవుతాయి. అయితే అభ్యర్థులు నిర్ణీత సమయానికంటే గంట ముందుగానే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, శానిటైజర్స్తో రావాల్సి ఉంటుంది.
ఫిజికల్ పరీక్షలు..
పీఈసెట్కు హాజరయ్యే అభ్యర్థులకు మూడు అంశాల్లో ఫిజికల్ టెస్ట్లు నిర్వహించనున్నారు. 100 మీటర్ల పరుగు, షార్ట్పుట్,హైజంప్ లేదా లాంగ్జంప్ ఉంటాయి. మూడో అంశం అభ్యర్థుల ఆసక్తి మేరకే ఉంటుంది.
హాజరుకానున్న ఉన్నత విద్యామండలి చైర్మన్..
ఎంజీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పీఈసెట్ను నల్లగొండలోని ఎంజీయూలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ॥ లింబాద్రి హాజరై ప్రారంభిస్తారు. ఆయన వెంట ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొ॥ వి.వెంకటరమణ, ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.కృష్ణారావు హాజరవుతారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
టీఎస్ పీఈసెట్-2022ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా 6 కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం. ఎంజీయూ పరిధిలో ఉమ్మడి జిల్లాలో ఎంజీయూ ప్రధాన క్యాంపస్తోపాటు హలియా, చౌటుప్పల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఏర్పాటు చేశాం. మిగిలిన మూడు కేంద్రాలను రంగారెడ్డి, వరంగల్, సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేశాం. ఎంజీయూలో పరీక్ష ముందు రోజు వచ్చే అభ్యర్థులకు వసతి కల్పించాం. ప్రత్యేక కేటగిరి అభ్యర్థులు తమ సర్టిఫికెట్స్ తీసుకురావాల్సి ఉంటుంది.
– ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి, చైర్మన్, టీఎస్ పీఈసెట్-22