రాష్ట్రంలోని గిరిజనులకు త్వరలో 10 శాతం రిజర్వేషన్లతోపాటు నిరుపేదలకు గిరిజన బంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గిరిజనులు, ఆ సంఘాల నేతలు ఆనందోత్సాహం వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి, స్థానిక గిరిజనులకే పాలన అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ తాజాగా చేసిన ప్రకటన గిరిజనుల సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. గతంలోనే ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్పై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించిన సంగతి తెలిసిందే. కేంద్రం నాన్చివేత వైఖరి అవలంబిస్తుండడంతో త్వరలోనే రిజర్వేషన్లపై జీఓ విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం సాహసోపేత నిర్ణయమని అభినందిస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్17(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా గిరిజనుల అభ్యున్నతి కోసం మరో కీలక ప్రకటన చేశారు. శనివారం బంజారాహిల్స్లో సంతుసేవాలాల్ బంజారా భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గిరిజన ఆదివాసీల నుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఇందులో ఇప్పటికే స్వరాష్ట్రంలో చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే సమాగ్రాభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో వారం రోజుల్లోనే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేకంగా జీఓ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు దళితబంధు మాదిరిగానే గిరిజనుల్లో నిరుపేదల కోసం గిరిజనబంధు అమలుకు కూడా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటనలు గిరిజనుల జీవితాల్లో మరింత వెలుగులు నింపుతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ గననీయమైన సంఖ్యలో గిరిజనులు ఉండగా వారందరికీ లబ్ధి చేకూరునుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 3.94 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఇందులో నల్లగొండ జిల్లాలో మొత్తం జనాభా 16,18,416 కాగా ఇందులో 12.9 శాతంతో 2,09,252 మంది గిరిజనులు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 10,99,560 మంది జనాభా ఉండగా 12.8 శాతంతో 1,41,271 మంది గిరిజనులు, యాదాద్రిభువనగిరి జిల్లాలో మొత్తం జనాభా 7,70,833 మంది కాగా 5.7శాతంతో 43,756 మంది గిరిజనులు ఉన్నారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో 11.30 శాతం గిరిజన జనాభా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. అయితే ఇప్పటివరకు గిరిజనులకు 6శాతం రిజర్వేషన్లే అమలవుతున్నాయి.
సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పటి రిజర్వేషన్లే నేటికీ అమలవుతూ వస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలోనే ఉద్యమనేతగా కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్ల అమలుపై ప్రకటన చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే ఇక్కడ 10 శాతం గిరిజన జనాభా ఉండనుందని, దాంతో ఇక్కడ అదే స్థాయిలో రిజర్వేషన్ల అమలు అవసరమని పలుమార్లు స్పష్టం చేశారు. దానికి కట్టుబడే గతంలోనే రాష్ట్ర అసెంబ్లీలో 10శాతం రిజర్వేషన్ల అమలు కోసం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. కానీ కేంద్ర ప్రభుత్వం దానిపై ఎటూ తేల్చడం లేదు.
ఈ నేపథ్యంలోనే శనివారం సీఎం కేసీఆర్ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూనే.. “మీరు చేయకపోతే మేమే ప్రత్యేక జీఓ తీసుకొచ్చి వారం రోజుల్లోనే 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు. దాంతో పాటు పేద గిరిజనులకు గిరిజనబంధును సైతం అమలు చేస్తామని చెప్పారు. ఓ వైపు ఇప్పటికే వందలాది తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ తాజాగా చేసిన ప్రకటన గిరిజనులను మరింత సంతోషానికి గురిచేస్తున్నది. దాంతో ఉమ్మడి జిల్లా అంతటా గిరిజనులు పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ఉత్సవాలకు సిద్ధమయ్యారు. గిరిజన సంఘాల నేతలు, గిరిజన ఉద్యోగులు, ప్రజాప్రతినిధులంతా పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన బంధువు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన ప్రకటించడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంతో కొట్లాడైనా రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆయన ప్రకటించడం గిరిజనుల పట్ల ఆయనకున్న అభిమానాన్ని తెలుపుతున్నది. నిరుపేద గిరిజనులకు గిరిజనబంధు ప్రవేశపెడతామని చెప్పడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్కు గిరిజనులు జీవితాంతం రుణపడి ఉంటారు.
– ఆంగోతు భగవాన్నాయక్, తిరుమలగిరి (సాగర్)
మాట మీద నిలబడే వ్యక్తి దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరే. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించడం హర్షణీయం. దాని వల్ల నిరుపేద గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. దాంతో పాటు గిరిజనబంధు పథకాన్ని కూడా అమలు చేస్తామని ప్రకటించడం ఆనందంగా ఉంది. గిరిజనులకు మేలు చేసే పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం ద్వారా దేశంలోని గిరిజనులకు మేలు కలుగుతుంది.
– ధనావత్ బాలాజీనాయక్, ఎంపీపీ, అడవిదేవులపల్లి
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులకు పెద్దదిక్కుగా ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలతో పాటు గిరిజనులు అభివృద్ధి చెందించాలని 10 శాతం రిజర్వేషన్, గిరిజన బంధుపథకం వంటివి అందించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఏనాడైనా గిరిజనుల గురించి ఆలోచించలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తండాలకు గ్రామ పంచాయతీలుగా మార్చడంతో పాటు వాటిని అభివృద్ధి చెందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ధీరావత్ లింగానాయక్, భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్, భువనగిరి
సీఎం కేసీఆర్ గిరిజనులకు రిజర్వేషన్లు పెంచడంతో వారికి మరిన్ని రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి గిరిజనులు అన్ని రంగాల్లో ముందజలో ఉంటున్నారు. గిరిజనుల రిజర్వేషన్ 10 శాతం పెంచడం, సబ్సిడీ రుణాలు, గిరిజన బంధు, మూడెకరాల భూమి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం వల్ల మరితం అభివృద్ధి చెందుతారు. గిరిజనుల గౌరవాన్ని పెంచి సమాజంలో మరింత ఉన్నతస్థాయిలోకి తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కొర్ర చందన, ప్రైవేటు ఉపాధ్యాయురాలు, భువనగిరి అర్బన్
గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. రిజర్వేషన్లు గిరిజనుల అభివృద్ధికి దోహద పడతాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా గిరిజనుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచడంతో పాటు వారి కోసం గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. రానున్న ఉద్యోగాల భర్తీల్లోనే 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతున్నాం.
– భిక్షం నాయక్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చివ్వెంల
సీఎం కేసీఆర్ గిరిజనులకు రిజర్వేషన్లు పెంచడం గొప్ప విషయం. గత ప్రభుత్వాలు గిరిజనులను గుర్తించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు గుర్తింపు ఇచ్చింది. ఇప్పటికే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వారికి గొప్ప అవకాశాలు కల్పించారు. సీఎం కేసీఆర్కు గిరిజనులు రుణపడి ఉంటారు.
– బానోత్ వెంకటనర్సింగ్ నాయక్, 31వ వార్డు కౌన్సిలర్, భువనగిరి
రాష్ట్రంలో గిరిజనులను గుర్తించింది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. దాంతో పాటు త్వరలో గిరిజన బంధు అందిస్తామని హామీ ఇవ్వడం హర్షణీయం. గిరిజన సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే గిరిజన బిడ్డలు నిలబడతారు. సీఎం కేసీఆర్కు గిరిజనుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము.
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించి ఆ హామీని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. దళితబంధు లాగే గిరిజనబంధు కూడా అమలు చేస్తామని చెప్పడం గొప్ప విషయం. దాని వల్ల గిరిజనుల కష్టాలు తీరుతాయి. ఏ ప్రభుత్వాలూ అమలు చేయని సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది.
– బాణోతు దేవులానాయక్, పెద్దరాజు తండా, మోతె మండలం
ఆదివాసీ, బంజారాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప విషయం. ఈ ప్రకటన చేయడం ద్వారా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. గత పాలకులు గిరిజనులను కేవలం ఓటు బ్యాంకు గానే చూశారు. 75ఏండ్ల స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో బంజారాలకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప గౌరవం కల్పించింది. రిజర్వేషన్ల పెంపుతో చట్టసభలు , విద్య, ఉద్యోగాల్లో గొప్ప అవకాశాలు వస్తాయి. సీఎం కేసీఆర్కు ఆదివాసీల తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు.
– ధనావత్ బిక్కూనాయక్, జడ్పీ వైస్చైర్మన్
కనీస వసతుల్లేకుండా ఉన్న తండాలను అభివృద్ధి చేసి వారి కోసం అనేక పథకాలు అమలు చేసిన సీఎం కేసీఆర్ గిరిజనులకు ఆరాధ్యుడిగా నిలిచారు. తండాల్లో 24 గంటల విద్యుత్, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందిస్తున్నారు. ప్రస్తుతం గిరిజన బంధు,10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం హర్షణీయం. సీఎం కేసీఆర్కు గిరిజన ప్రజలంతా రుణపడి ఉంటాం.
– రాజు, వైస్ ఎంపీపీ, సంస్థాన్ నారాయణపురం,
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు సీఎం కేసీఆర్. గిరిజనుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పథకాలను రూపొందించి వాటి అమలుకు చర్యలు చేపడుతున్నారు. గిరిజన ఆత్మగౌరవ భవనాన్ని ప్రారంభించి గిరిజనులకు సమున్నత స్థానం కల్పించారు. రిజర్వేషన్లు పెంచి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు రిజర్వేషన్ల పెంచడం సంతోషకరం. రాబోయే రోజుల్లో గిరిజనులంతా టీఆర్ఎస్ వైపే ఉంటారు.
– భూక్యా భాస్కర్నాయక్, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ నాయకుడు, భువనగిరి