రామగిరి, ఫిబ్రవరి 4 : దేశంలో ఉన్నత విద్యా ప్రమాణాల అభివృద్ధి, యూనివర్సిటీలకు గుర్తింపు అందించే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) చైర్మన్గా ఎంపికైన మామిడాల జగదీశ్కుమార్ స్వగ్రామం తిప్పర్తి మండలం మామిడాల. మారుమూల గ్రామం నుంచి అత్యుత్తమ పదవికి ఎంపిక కావడంపై గ్రామస్తులు, జిల్లాకు చెందిన విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్గా కొనసాగుతున్న ఆయనకు ఈ అవకాశం దక్కడం గమనార్హం. తాను పుట్టి పెరిగిన ఊరితో ఇప్పటికీ అనుబంధాన్ని కొనసాగిస్తున్న జగదీశ్ కుమార్.. గతేడాది నవంబర్లో తన తండ్రి మృతి చెందగా.. స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేసి వెళ్లారు.
మామిడాల రంగారావు- జయప్రద దంపతులకు జగదీశ్కుమార్తో పాటు ఇద్దరు కూతుళ్లు. జగదీశ్ కుమార్ విద్యాభాస్యం స్వగ్రామంలో ప్రారంభమైంది. ఆరో తరగతి వరకు ఊళ్లోనే చదివిన జగదీశ్కుమార్.. తర్వాత ఉన్నత పాఠశాల విద్యను, ఇంటర్మీడియట్ను బంధువుల సాయంతో మిర్యాలగూడలో పూర్తి చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. 1982లో ఆయన మద్రాసు చేరారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎంఎస్..ఆ తర్వాత అక్కడే, అదే విభాగంలో పీహెచ్డీ సైతం పూర్తి చేశారు. అనంతరం కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీలో 1991 నుంచి మూడేండ్లపాటు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో పోస్ట్ డాక్టరల్ పరిశోధన కొనసాగించారు.
జగదీశ్కుమార్ తల్లిదండ్రులు మామిడాల రంగారావు, జయప్రదాదేవి. లక్ష్మిని 1990లో వివాహం చేసుకున్నారు. లక్ష్మి ఎంబీఏలో మార్కెటింగ్ చదివారు. ఆమె ఉద్యోగం కంటే కుటుంబ నిర్వహణ బాధ్యతలకే మొగ్గు చూపారు. సాకేత్, కార్తీక్ అనే వారి ఇద్దరు కుమారులూ జర్మనీలో నానో ఎలక్ట్రానిక్స్ చదువుతున్నారు. జగదీశ్ తండ్రి రంగారావు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా 1994లో విరమణ పొందారు. తల్లి జయప్రదాదేవి గతంలోనే చనిపోగా తండ్రి రంగారావు 2021 నవంబర్లో మృతి చెందారు.
ఎంతో సంతోషంగా ఉంది…
మా సోదరుడు జగదీశ్ను కేంద్ర ప్రభుత్వం యూజీసీ చైర్మన్గా నియమించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని ఆశిస్తున్నాను. చిన్నతనం నుంచి కృషి, పట్టుదలతో విద్యభ్యాసం కొనసాగించాడు. ఆ పట్టుదలే విజయానికి కారణం.
– మామిడాల ప్రవీణ్ రావు, జగదీశ్కుమార్ సోదరుడు, మామిడాల
గర్వంగా ఉంది…
మారుమూల గ్రామమైన మా మామిడాల వాసికి ఢిల్లీ స్థాయిలో ఉన్నత పదవి దక్కడం మా గ్రామానికి గౌరవంగా భావిస్తున్నాం. మా గ్రామం పేరు దేశ వ్యాప్తంగా మార్మోగడం గర్వకారణం. కృషి, పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చనేందుకు జగదీశ్కుమార్ సార్ నిదర్శనం.
– కొత్తపల్లి సిరివెన్నెల, ఎంపీటీసీ, మామిడాల
జగదీశ్ కుమార్ను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి..
మా గ్రామవాసి మామిడాల జగదీశ్కుమార్ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. గ్రామంలోనే విద్యాభ్యాసం ప్రారంభించిన జగదీశ్కుమార్ అంచెలంచెలుగా ఎదుగడం మాకు గర్వకారణం. విద్యార్థులంతా పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులతో పాటు గ్రామానికి పేరు తీసుకురావాలి.
– బొల్లెద్దు నాగరాణి, సర్పంచ్, మామిడాల