నేరేడుచర్ల, సెప్టెంబర్ 5 : నేరేడుచర్ల, సెప్టెంబర్ 5 : ప్రభుత్వ పాఠశాలల్లో నిలిపివేసిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పునరుద్ధరించారు. కరోనా విజృంభణ కారణంగా సుమారు రెండున్నరేండ్లుగా ఈ విధానాన్ని నిలిపివేశారు. 2020 మార్చి నుంచి ఉపాధ్యాయులు మాన్యువల్ విధానంలోనే సంతకాలు చేశారు. ఈ నెల 1 నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉపాధ్యాయులు దాని ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పునరుద్ధరించారు. కరోనా కారణంగా రెండున్నరేండ్లుగా ఈ విధానం నిలిపివేసిన విషయం తెలిసిందే. 2020 మార్చిలో పాఠశాలలు మూతపడగా, విద్యార్థులకు 2020 జూన్లో ఆన్లైన్ విధానం ద్వారా బోధన జరిగింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో 2021 ఆగస్టులో పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ.. ఇప్పటి వరకు ఉపాధ్యాయులు మాన్యువల్ విధానంలోనే సంతకాలు చేశారు. కరోనా ప్రభావం తగ్గడంతో ఈ నెల 1నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు.
కరోనా విజృంభనకు ముందు వరకు ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. కరోనా కారణంగా మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడకం, దూరం పాటించడం తదితర కారణాలతో బయోమెట్రిక్ను బంద్ చేసి.. తిరిగి పాత విధానంలో ఉపాధ్యాయులు హాజరు పట్టికలో మాన్యువల్ విధానంలో సంతకాలు చేశారు. ఈ నెల 1నుంచి అన్ని బడుల్లో బయోమెట్రిక్ విధానంతో ఉపాధ్యాయులు హాజరు నమోదు చేస్తున్నారు.
ఆలస్యమైతే ఆరోజు సెలవే..
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లోకి తెచ్చింది. ఉపాధ్యాయులు సమయానికి బయోమెట్రిక్ వేయకుండా ఆలస్యంగా వేస్తే ఆరోజు వారికి సెలవు కింద పరిగణిస్తారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9: 15గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తాయి. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9:15 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9:35 నుంచి సాయంత్రం 4:45గంటలకు ముగుస్తాయి. ఉపాధ్యాయులు ఉదయం పాఠశాలకు వచ్చిన సమయంలో, సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాలి.
డుమ్మా మాస్టర్లకు చెక్..
పాఠశాలలకు డుమ్మా కొట్టే వారికి బయోమెట్రిక్తో చెక్ పడనుంది. బడికి ఆలస్యంగా రావడం, తిరిగి తొందరగా ఇంటికి వెళ్లేవారికి బయోమెట్రిక్ విధానం ఇబ్బందిగా మారింది. బయోమెట్రిక్తో ఆన్లైన్ విధానంలోనే వేలిముద్రతో హాజరు నమోదు కానుండడంతో పారదర్శకత ఉంటుంది. దాంతో విద్యార్థులకు బోధన మరింత మెరుగయ్యే అవకాశాలున్నాయి.
అన్ని పాఠశాలల్లో అమలు చేశాం
బయోమెట్రిక్ విధానంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అన్ని పాఠశాలల్లో అమలు చేశాం. కరోనా కారణంగా రెండున్నరేండ్లపాటు మాన్యువల్ విధానంలో హాజరు పట్టికలో ఉపాధ్యాయులు సంతకాలు చేశారు. తిరిగి ఈ నెల 1నుంచి బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నాం.
– చత్రునాయక్, ఎంఈఓ, నేరేడుచర్ల