స్వరాష్ట్రంలో తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే.. సహకరించి చేయూతనివ్వాల్సిన కేంద్రం కక్ష సాధిస్తున్నది. గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు దాటినా 15వ ఆర్థిక సంఘం నిధులు పైసా విదిల్చకుండా పల్లెప్రగతిని అడ్డుకుంటున్నది.జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను సైతం మూడు నెలల నుంచి విడుదల చేయకుండా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నది. రూ.8కోట్ల మెటీరియల్ డబ్బులు పెండింగ్లో పెట్టి నాన్చుతున్నది. జిల్లాలో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించే మోదీ సర్కారు కుట్రపై పంచాయతీ పాలక మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నిరాటంకంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.6.20కోట్ల నిధులతోనే పల్లెల్లో పనులు కొనసాగుతున్నాయి.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా పత్తా లేకుండా పోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రావాల్సిన నిధులు విడుదల చేయడం లేదు. గతంలో కేంద్రం ఆర్థిక సంఘం నిధులను రాష్ర్టానికి ఇస్తే వాటిని తెలంగాణ సర్కారు గ్రామ పంచాయతీలకు అందించేది. ఒకవేళ ఆలస్యంగా జమ చేసినా వడ్డీ కూడా కట్టించేది. కానీ గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు కేంద్రమే నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
ఇందుకోసం గ్రామ పంచాయతీ పాలక వర్గాలు బ్యాంక్ ఖాతాలు కూడా తెరిచాయి. కానీ ఇప్పటి దాకా ఖాతాల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. టెక్నికల్ సమస్యలు ఉన్నాయని, అందుకే రావడం లేదని చెబుతూ కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీని బట్టి ఏటా పంచాయతీకి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా నిధులు రావాల్సి ఉన్నది. పాలక వర్గాలు మాత్రం నిధులు ఎప్పుడొస్తయా అని ఆశగా ఎదురుచూస్తున్నాయి.
జాతీయ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. బడుగు శ్రమ జీవుల పొట్ట కొట్టేలా, పల్లెల్లో అభివృద్ధి పనులకు కత్తెరేస్తూ, పనులకు ఆటంకం కలిగిస్తూ పథకాన్ని కుదించేందుకు పన్నాగాలు పన్నింది. ఇప్పటికే ఉన్న రూల్స్ కాదని.. ఒక్కో గ్రామంలో 20 పనులు మాత్రమే చేయాలని హుకుం జారీ చేసింది. కొత్త నిబంధనలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఫలితంగా గ్రామాల్లో అనేక రకాల పనులు నెమ్మదించడం, పనులు ఆగిపోవడం జరుగుతున్నది. గతంలో మాదిరి ఇకపై ఒకేసారి అన్ని పనులు చేపట్టేందుకు వీలుండదు. ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో గ్రామాల్లో ఉపాధికి గండి పడుతోంది.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఆర్థిక సంఘం నిధుల విడుదల జాప్యంతో గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోతుంది. పనులకు నిధులు లేక గ్రామాలు అస్తవ్యస్థంగా తయారౌతున్నాయి. గ్రామాల అభివృద్ధిలో కేంద్రం పాత్ర శూన్యంగా మారుతుంది. మూడు నెలలుగా ఆర్థిక సంఘం నిధుల జాడే లేదు. గ్రామ పంచాయతీలకు నేరుగా నిధుల విడుదల పేరుకే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
– జక్క కవితారాఘవేందర్రెడ్డి, సర్పంచ్, నాగిరెడ్డిపల్లి
రాష్ట్ర ప్రభుత్వం నెల నెలా విడుదల చేసే నిధులే గ్రామాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధుల విడుదల జాప్యంతో గ్రామాల అభివృద్ధికి తీవ్ర నష్టం జరుగుతున్నది. పల్లెల్లో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. నిధుల విడుదలలో కేంద్రం జాప్యం ఎంతమాత్రం తగదు.
– చిన్నం పాండు, సర్పంచ్, చందుపట్ల
కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు నిధులను ఇస్తోంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేస్తున్నది. కుట్రలు, కుతంత్రాలతో కేంద్రం గ్రామాల అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా రాష్ట్ర నిధులతో పనులు దిగ్విజయంగా ముందుకు సాగుతున్నాయి. రాష్ట్ర నిధులు గ్రామ పంచాయతీలకు ఆసరా అవుతున్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీకి తన వాటాగా సుమారు రూ.40 లక్షల దాకా చెల్లిస్తోంది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ.6.20 కోట్లు విడుదల అయ్యాయి. వీటితోనే గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి.
జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామాల్లో వివిధ రకాల పనులు చేపడుతుంటారు. ఏటా గ్రామ సభలు నిర్వహిస్తూ అవసరమయ్యే పనులు, దాని ఖర్చును ముందుగానే అంచనా వేస్తారు. జిల్లా వ్యాప్తంగా 421 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 13,343 పనులు నడుస్తున్నాయి. ఒక్కో గ్రామంలో 40 నుంచి 50 రకాల పనులు కొనసాగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా రహదారులు, ఇంకుడు గుంతలు, వైకుంఠధామాలు, ఫిష్పాండ్స్, మొక్కలు నాటడం తదితర అనేక రకాల పనులు జరుగుతుంటాయి. కానీ కేంద్రం ఉపాధి నిధులు విడుదల చేయకపోవడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. జిల్లాకు సుమారు రూ.8 కోట్ల నిధులు రావాల్సి ఉన్నది. మూడు నెలలుగా నిధులు రాకపోవడంతో బిల్లుల చెల్లింపులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా ఉపాధి కూలీలకు కూడా రూ.80 లక్షలు పెండింగ్లో ఉన్నాయి.