గణేశ్ నవరాత్రోత్సవాలు జిల్లా అంతటా వైభవంగా సాగుతున్నాయి. అట్టహాసంగా ముస్తాబు చేసిన మండపాల్లో వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. వినాయక చతుర్థిని పురస్కరించుకుని బుధవారం ఊరూవాడ గణనాథుడి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు ప్రారంభించారు. గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులు పూజల్లో పాల్గొన్నారు. విఘ్నాలు తొలగించి విజయాలు అందించాలని భక్తులంతా బొజ్జ గణపయ్యను వేడుకున్నారు.
వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. గణపతి విగ్రహాలను వాడవాడలా ఏర్పాటు చేసిన మండపాల్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రకాల పాయసాలు, ఉండ్రాళ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. భక్తి పాటలు, యువకుల నృత్యాలతో గ్రామాలు, పట్టణాల్లో పండుగ శోభ ఉట్టిపడింది. నవరాత్రోత్సవాల సందర్భంగా మండపాలు, గణేశుడి విగ్రహాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పర్యావరణహితం కోసం ఈ సారి మట్టి గణపతులకే ప్రాధాన్యం ఇచ్చారు. కరోనా తర్వాత రెండేండ్లకు జరుగుతున్న వేడుకలు ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరుస్తున్నాయి.