నల్లగొండ, ఆగష్టు 15 : ఆసరా పింఛన్ల కోసం నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి వారం కింద శుభవార్త చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటకు అనుగుణంగా నూతన పింఛన్లు మంజూరు చేశారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పింఛన్లను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.10లక్షల మందికి నూతన పింఛన్లు మంజూరు కాగా వాటిలో కొన్ని నామినల్గా సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, నల్లగొండలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన పింఛన్లు లబ్ధిదారుల వారీగా ఆయా మండలాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పంపించగా వాటిని వారం రోజుల్లో ఆయా ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులు పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 3.77లక్షల పింఛన్లు అందజేస్తున్న సర్కార్ నూతనంగా మంజూరు చేసిన 1.10 లక్షల పింఛన్లతో కలిపి ఇక ప్రతి నెలా 4.87లక్షల మందికి ఆసరా పింఛన్లు అందజేయనున్నది.
ఎమ్మెల్యేల సమక్షంలో పంపిణీ..
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నూతన పింఛన్లు మంజూరు చేయగా వాటిలో కొన్నింటిని సోమవారం ఆయా జిల్లాల్లో జెండావిష్కరణ అనంతరం అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,87,878 కొత్త పింఛన్లు మంజూరు కాగా అందులో నల్లగొండకు 51,007, సూర్యాపేటకు 34,822, యాదాద్రి భువనగిరి జిల్లాకు 24,976 పింఛన్లు మంజూరయ్యాయి. వీటిలో నామినల్గా కొందరికి సోమవారం అందజేయగా మిగిలిన పింఛనుదారుల వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆయా మండలాలకు పంపించింది. మండల అధికారుల ద్వారా స్థానిక శాసనసభ్యులు వాటిని నేటి నుంచి వారం రోజుల్లో అందజేసేలా చర్యలు తీసుకోనున్నారు.
ప్రతి నెలా రూ.106 కోట్లు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 3,77,073 మందికి ఆసరా పింఛన్లు అందజేస్తున్న ప్రభుత్వం తాజాగా మూడు జిల్లాల్లో 1,10,805 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేసింది. ఇందులో 82,207 మంది వికలాంగులు ఉండగా 4,05,671 మంది ఇతర సామాజిక వర్గాల వారు ఉన్నారు. వికలాంగులకు ప్రభుత్వం నెలకు రూ. 3,016 చొప్పున జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా రూ.24.79 కోట్లు ఇవ్వనుండగా మిగిలిన వారికి రూ. 2,016 చొప్పున రూ. 81.78 కోట్లు అందజేయనుంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో అసరా పథకం కింద ప్రభుత్వం ప్రతి నెలా రూ. 106.78 కోట్లు వెచ్చించనున్నది.
తొలి రోజు నామినల్గా అందజేశాం..
జిల్లా వ్యాప్తంగా ఆసరా పథకం కింద దరఖాస్తు చేసుకున్న 51,007 మందికి పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. తొలి రోజు సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నామినల్గా అందజేశాం. మిగిలిన వారి వివరాలను ఆయా మండల కార్యా లయాలకు పంపించాం. వాటిని ఆయా నియోజక వర్గాల్లోని శాసన సభ్యులు లబ్ధిదారులకు అందజేస్తారు.
– కాళిందిని, డీఆర్డీఏ పీడీ, నల్లగొండ