నీలగిరి, ఆగస్టు 12 : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో ఈ నెల 4న సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనను పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భర్తను కడతేర్చేందుకు ప్రియుడితో కలిసి ప్రణాళిక రూపొందించిన భార్య.. అది విఫలం కావడంతో అడ్డంగా దొరికి కటకటాల పాలైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రెమా రాజేశ్వరి శుక్రవారం వెల్లడించారు. మర్రిగూడ మండలం తమ్మడవల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ హైదరాబాద్ వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం అతని భార్య చనిపోయింది. కాగా, అదే పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్న నిమ్మల సంధ్యతో బాలకృష్ణకు వివాహేతర సంబ ంధం ఏర్పడింది. దాంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని సంధ్య భర్త స్వామిని చంపేందుకు పథకం రచించారు. స్వామిని హత్య చేసేందుకు బాలకృష్ణ చింతపల్లి మండలం మాల్కు చెందిన స్నేహితుడైన రామస్వామిని సంప్రదించాడు. రామస్వామి తన స్నేహితులైన పోల్గిరి (వింజమూరు), రత్నాల వెంకటేశ్(మాల్)తో కలిసి స్వామిని చంపేందుకు రూ.3లక్షలకు ఒప్పందం కుదుర్చు కున్నాడు.
ఇందుకు రూ.1.70 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నాడు. బ్రాహ్మణవెల్లెంలలో నివాసముంటున్న స్వామి మునుగోడు మండల కేంద్రంలో వాటర్ ప్లాంటు నిర్వహిస్తున్నాడు. స్వామిపై నిఘా ఉంచేందుకు వాటర్ ప్లాంట్ పక్కనే మరో మడిగె అద్దెకు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసున్నట్లు నటించారు. స్వామి కదలికలను చెప్పేందుకు వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్న మొయినుద్దీన్కు రూ.2 వేలు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని స్వామిని ప్రోత్సహించి మద్యం మత్తులో చంపాలని యత్నించారు. అది వీలు కాకపోవడంతో హత్యాయత్నాన్ని విరమించుకున్నారు. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని రామస్వామి అడుగగా ఖర్చు అయినట్లు చెప్పడంతో ప్రామిసరీ నోట్ రాయించుకున్నాడు. అనంతరం స్వామిని హత్య చేసేందుకు హైదరాబాద్లోని తన ఇంట్లో ప్లంబర్ పనిచేసిన యూసుఫ్ను బాలకృష్ణ సంప్రదించాడు.
యూసఫ్ తన స్నేహితులైన అబ్దుల్ రెహమాన్, జహంగీర్ పాషా, ఆసిఫ్ఖాన్ (సుఫారీ గ్యాంగ్)తో కలిసి రూ.11 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు అడ్వాన్స్గా బాలకృష్ణ రూ.4 లక్షలు,సంధ్య రూ.లక్షమొత్తం రూ.5లక్షలు ఇచ్చారు. ఆగస్టు 4న స్వామి తన వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో రెహమాన్ మరొకరు బైక్పై వచ్చి తన వెంట తెచ్చుకున్న 7.65 ఎంఎం పిస్టల్తో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. స్వామి చనిపోయాడని భావించి వారు పారిపోయారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న స్వామిని స్థానికులు కామినేని దవాఖానకు తరలించగా ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు.
విచారణ చేసి కేసును చేధించిన పోలీసులు బాలకృష్ణ, సంధ్య, అబ్దుల్ రెహమాన్, జహంగీర్ పాషా, రామస్వామి, ఆసిఫ్ఖాన్, పోల్గిరి, రత్నాల వెంకటేశ్, మహ్మద్ మొయినొద్దీన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. యూసుఫ్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 9 మొబైల్స్, రూ. 4,500 నగదు, రెండు ప్రామిసరీ నోట్లు, చెక్బుక్, పాస్బుక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి, సీసీఎస్ డీఎస్పీ మొగులయ్య, సీఐలు రాఘవరావు, అశోక్, శంకర్రెడ్డి, ఎస్ఐలు విజయ్కుమార్, సతీశ్రెడ్డిని ఎస్పీ అభినందించారు.