మోత్కూరు, ఆగస్టు 12: రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. మోత్కూరు మండలం దత్తప్పగూడేనికి చెందిన కంచర్ల రామకృష్ణారెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్నారు. 2018, జూలై 20న తొలిసారి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్గా సీఎం కేసీఆర్ నియమించారు. అనంతరం రెండు, మూడో సారి పదవీ కాలన్నీ మరో ఏడాది పొడిగించారు. కాగా గత నెల 20న ఆయన పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి మరోసారి పదవీ కాలం పొడించాలని సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించారు. దాంతో సీఎం కేసీఆర్ కృష్ణారెడ్డి పదవీ కాలం మరో రెండేండ్ల పాటు పొడిగిస్తూ ఆదేశాలను జారీ చేశారు. ఉద్యమ నాయకుడిగా రామకృష్ణారెడ్డి చేసిన సేవలను గుర్తించి నాలుగో సారి అరుదైన గౌరవం లభించడం ఆయిల్ పామ్ సాగు చేపట్టిన రైతులతో పాటు జిల్లా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనపై నమ్మకంతో సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా పని చేసి రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆయిల్ పామ్ను మరింతగా విస్తరించడానికి కృషి చేయనున్నట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు, సహకరించిన మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.