మునుగోడు, ఆగస్టు 12 : స్వలాభం కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 20న సీఎం కేసీఆర్ నిర్వహించనున్న ప్రజాదీవెన సభకు అనువైన స్థలాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన నీచుడు రాజగోపాల్రెడ్డి అన్నారు. ఇలాంటి అభివృద్ధి నిరోధకుడిని మునుగోడు ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డికి డిపాజిట్ కూడా రానివ్వమని, టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఎనిమిదేండ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచిన కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై అధిక భారాన్ని మోపిందన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు మోదీ సర్కారు కుట్రలు చేస్తుందన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే సీఎం కేసీఆర్ మునుగోడుకు వస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వామపక్షాలు సైతం టీఆర్ఎస్కే మద్దతు పలుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలోనే మునుగోడు అభివృద్ధి సాధించిందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే మునుగోడు మళ్లీ పదేండ్లు వెనక్కి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకు ముందు చల్మెడలో మంత్రికి పలువురు మహిళలు, చిన్నారులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, టీఎస్ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు, ఎస్పీ రెమా రాజేశ్వరి, డీఎస్పీ నరసింహారెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, ఎంపీపీలు కర్నాటి స్వామి, భానుమతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు బండ పురుషోత్తంరెడ్డి, నిరంజన్గౌడ్, లక్ష్మయ్య, రాష్ట్ర నాయకులు నారబోయిన రవి, బొల్ల శివశంకర్, కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్, నాయకులు ఉన్నారు.
దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
సంస్థాన్ నారాయణపురం : దళితులు ఆర్థికాభివృద్ధి సాధించి సమాజంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20న సీఎం కేసీఆర్ హాజరవుతున్న ప్రజా దీవెన సభ కోసం మండలంలోని పుట్టపాక, నారాయణపురం, గుడిమల్కాపురం గ్రామాల్లో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గుడిమల్కాపురం గ్రామానికి చెందిన దళితుబంధు లబ్ధిదారు గాదె మంజుల-శ్రీను దంపతులు ఏర్పాటు చేసుకున్న వస్త్ర దుకాణం, టెంట్హౌజ్ను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం శివాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రి జగదీశ్రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు.