నల్లగొండ ప్రతినిధి, జనవరి11(నమస్తే తెలంగాణ):సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లుగా రైతు బంధు సంబురాలు కొనసాగుతున్నాయి. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయానికి పెద్దన్నలా చేయూతనిస్తున్న సీఎం కేసీఆర్కు జై కొడుతున్నారు. నేరడుచర్లలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మాడ్గులపల్లిలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొన్నారు. పలు రైతువేదికలను ప్రత్యేకంగా ముస్తాబు చేయగా అందులో రైతులంతా కలిసి రైతుబంధు ఉత్సవాలు నిర్వహించారు. మహిళా రైతులు సంక్రాంతి ముగ్గులు వేసి రైతు బంధు పథకాన్ని ప్రతిబింబించారు. సంక్రాంతి వరకు రైతుబంధు వేడుకల నిర్వహణకు జిల్లా రైతులు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.
జమవుతున్న పెట్టుబడి సాయం..
వరుసగా ఎనిమిదో విడుత పెట్టుబడి సాయంగా రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమవుతున్నాయి. మంగళవారం నాటికి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి రూ.725.48కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. గత నెల 28 నుంచి రైతుబంధు డబ్బులు పడుతున్నాయి. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 90శాతం, సూర్యాపేట జిల్లాలో 92శాతం మంది రైతులకు రైతుబంధు డబ్బులు జమ చేశారు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం… నల్లగొండ జిల్లాలో మొత్తం 4.93లక్షల మంది అర్హులైన రైతులు ఉండగా వారిలో బ్యాంకు అకౌంట్ సహా వివరాలను అందజేసిన వారు 4.69లక్షల మంది ఉన్నారు. వీరిలో వ్యవసాయ శాఖ అధికారులు వెరిఫికేషన్ చేసిన అనంతరం మొత్తం రూ.571.78కోట్లకు సంబంధించిన 4.66లక్షల మంది రైతుల వివరాలను ట్రెజరీ కార్యాలయానికి నివేదించారు. ఇందులో ఇప్పటివరకు 4.43లక్షల మంది రైతులకు రూ.475.12 కోట్లు పెట్టుబడిసాయంగా మంగళవారం నాటికి రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగతా వారికి పండుగ లోపు అందనున్నాయి.
సూర్యాపేట జిల్లాలో 2.70లక్షల మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండగా అందులో వివరాలను అందించిన రైతులు 2.61లక్షల మంది ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు మొత్తం 2.59లక్షల మంది రైతుల వివరాలను వెరిఫికేషన్ అనంతరం వ్యవసాయశాఖ ట్రెజరీ శాఖకు అందజేసింది. వీరికి రూ.297.56కోట్లు పెట్టుబడిసాయం అందాల్సి ఉంది. మంగళవారం నాటికి దశలవారీగా మొత్తం 2.48లక్షల మంది రైతులకు రూ.250.36 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన రైతుల ఖాతాల్లోనూ సంక్రాంతి నాటికి జమ కానున్నట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాగానే వెంటనే వారి ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ రైతుబంధు సంబురాల్లో భాగస్వాములవుతున్నారు. గతంలో ఏ నేత కూడా ఇలా రైతుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవని పేర్కొంటున్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా రైతుల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తూ సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని రైతులు అభినందిస్తున్నారు.
కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణ యుగం
సీఎం కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణ యుగం కొనసాగుతున్నదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ నాయకుడు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థతో కలిసి మండల కేంద్రంలో రైతు బంధు సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అన్నదాతలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీరందిస్తున్నారని, 24 గంటల ఉచిత కరంట్తోపాటు రైతుబంధు, రైతుబీమా పథకాలు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మోషన్ అలీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, నాయకులు సూదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, రాజు, రవి, మధుసూదన్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.