రామగిరి, ఆగస్టు 12 : మునుగోడు ఉప ఎన్నికతో బీజేపీ పతనం ప్రారంభమైందని, నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం గతంలో కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచిందని, ఐదు పర్యాయాలు సీపీఐ గెలుచుకుందని అన్నారు. 2018లో కాంగ్రెస్కు సీపీఐ మద్దతు ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా స్వార్థ ప్రయోజనాల కోసం పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నాడని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దమ్ముంటే మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. మోదీ పాలనలో అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిన బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కమ్యూనిస్టుల ప్రధాన శత్రువు బీజేపీ అని, ఉప ఎన్నికలో ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.