నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ) : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. అందులోభాగంగా మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలిరోజు త్రివర్ణ పతాకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ నెల 15న ప్రతిఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ముందుస్తుగానే ప్రతి ఇంటికీ జాతీయ జెండాను చేరవేసే కార్యక్రమాన్ని మంగళవారం ప్రజాప్రతినిధులు, అధికారులు చేపట్టారు. ముందుగా పట్టణ ప్రాంతాల్లో దీనికి శ్రీకారం చుడుతూ అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా పాలకవర్గ సమావేశాలు నిర్వహించారు.
స్వాతంత్రోద్యమ చరిత్రను ప్రస్తావించి, అమరుల త్యాగాలను గుర్తు చేసి జాతీయ గీతాలాపన చేశారు. నల్లగొండ మున్సిపల్ సమావేశానికి మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ రెమారాజేశ్వరి పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల ప్రాధాన్యతను వివరించారు. వజ్రోత్సవ వేళ ప్రజల్లో దేశభక్తిని, సమైక్యతా భావాన్ని పెంపొందించేలా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం14 రోజులపాటు నిత్యం ఒక కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. సాయంత్రం సూర్యాపేటలో జరిగిన సమావేశంలోనూ మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొని ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.
వజ్రోత్సవాల సందర్భంగా రాజాపేట మండలం రేణికుంటలో సాతంత్య్ర సమరయోధుడు చింతలపూరి జనార్దన్రెడ్డిని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఘనంగా సన్మానించారు. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. నకిరేకల్లో జరిగిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ త్రివర్ణ పతాకాలను ప్రజలకు అందజేశారు. నందికొండ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే నోముల భగత్ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం త్రివర్ణపతాకాలను ప్రజలకు పంపిణీ చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఉత్సవాలను ప్రారంభించి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కోదాడ నియోజకవర్గం నడిగూడెం రాజావారి కోటలో వజ్రోత్సవాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రారంభించారు. కోట ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి త్రివర్ణపతాకాలను ప్రజలకు పంపిణీ చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ ఉత్సవాలను ప్రారంభించి జాతీయ జెండాలను అందజేశారు. ఉత్సవాల్లో రెండోరోజు బుధవారం ఉమ్మడి జిల్లా అంతటా వనమహోత్సవానికి ఏర్పాట్లు చేశారు. గురువారం అన్ని పట్టణ, మండల కేంద్రాల్లో 2కే ఫ్రీడం రన్కు జిల్లా పోలీసు యంత్రాంగాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. స్థానిక యువతతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21వరకు ప్రతి రోజూ ఒక కార్యక్రమం చేపడుతూ వేడుకలను ఘనంగా కొనసాగించనున్నారు.