నీలగిరి, ఆగస్టు 9 :జాతీయ సమైక్యత, జాతీయ స్ఫూర్తి, స్వాతంత్య్ర పోరాటంలో మహనీయుల త్యాగాలను మూడో తరానికి తెలియజేయాలని, స్వతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నల్లబోతు భాస్కర్రావుతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 8 నుంచి 22 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. స్వాతంత్య్ర పోరాట ప్రాశస్త్యం, పోరాట యోధుల స్ఫూర్తి మూడో తరానికి తెలియజేయాలని సూచించారు. 1947కు మందు సంస్థానాలు ఉండేవని, దాని వల్ల ఇతర దేశస్తులు భారతదేశంపై దండయాత్రలు చేసేవారని తెలిపారు. అంటరానితనం, నిరాక్షరాస్యత వల్ల దేశంలో భక్తిభావం వెనుకబడిందన్నారు. దీన్ని రూపు మాపేందుకు గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దానిద్వారా స్వాంతంత్య్రాన్ని సాధించారని చెప్పారు. నాటి సామాజిక, ఆర్థిక, పరిస్థితులు అధిగమించి ఎటువంటి ప్రచార సాధనాలు లేని రోజుల్లోనే విభిన్న వర్గాల ప్రజలందరినీ ఏకధాటిపైకి తీసుకొచ్చి సాధించిన స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను నేటి యువతకు తెలియ చెప్పేందుకే వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం రూపకల్పన చేసిందని తెలిపారు. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని అన్నారు.
47వ వార్డులో ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని 47వ వార్డులో మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు. ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలను అందజేసి స్వాతంత్య్ర ఉద్యమాల గురించి వివరించారు. జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన భారత వజ్రోత్సవాలను జిల్లా స్థాయి నుంచి గ్రామ స్ధాయి వరకు విజయవంతం చేయాలని కోరారు.
ప్రజాప్రతినిధులుగా భాగస్వాములు కావడం అదృష్టం:ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే వజ్రోత్సవాల్లో ప్రజాప్రతినిధులుగా భాగస్వాములు కావడం తమ అదృష్టమన్నారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని స్మరిస్తూ జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. 15 రోజులపాటు చేపట్టే వివిధ రకాల కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
దేశ సమైక్యతను చాటాలి : ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటాలని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పేరుతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.