ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ఎస్ఐ ప్రిలిమ్స్ నిర్వహించనున్నది. ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 57 సెంటర్లను ఏర్పాటుచేయగా, 21,931మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తుండడంతో అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రామగిరి, ఆగస్టు 6 : తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్సీఆర్టీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే ‘ఎస్ఐ ప్రిలిమ్స్’ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనున్నది. నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తుండటంతో అభ్యర్థులు గంట ముందుగానే రావాలని అధికారులు సూచించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నందున అభ్యర్థులు జాగ్రత్తగా సరైన సమాధానాలు మాత్రమే రాయాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంలో అక్రమాలు జరిగితే ఆ కేంద్రం చీఫ్సూపరింటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
నల్లగొండ జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో మొత్తం మూడు రీజియన్లుగా విభజించి 33 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 13,307 మంది హాజరు కానున్నారు. రీజియన్-1కు కోఆర్డినేటర్గా ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి బి.నాగారాజు వ్యహరిస్తుండగా దీని పరిధిలో 19 కేంద్రాల్లో 7,356 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. రీజియన్ -2కు కోఆర్డినేటర్గా నకిరేకల్ ఫ్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొల్లోజు చంద్రశేఖర్ వ్యహరిస్తున్నారు. దీని పరిధిలో 8పరీక్ష కేంద్రాలు ఉండగా 3492మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రీజియన్ -3కు కోర్డినేటర్గా మిర్యాలగూడలోని కేఎన్ఎం ఫ్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వ్యహరిస్తున్నారు. 6పరీక్ష కేంద్రాలుండగా 2459 మంది హాజరవుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలో రెండు డివిజన్లలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా కేంద్రంలో 18, కోదాడ పట్టణంలో 5 సెంటర్లు ఉన్నాయి. రెండు కేంద్రాల్లో కలిపి 8 వేల మంది పరీక్ష రానున్నారు.
యాదాద్రిలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 624మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
అభ్యర్థులు పాటించాల్సిన నియమాలు
పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. హాల్టికెట్ను ఏ- 4 సైజు పేపర్లో రెండు వైపుల ప్రింట్ వచ్చేలా తీసుకోవాలి. ముందువైపు అభ్యర్థి దరఖాస్తు చేసిన సమయంలో ఉన్న ఫోటో విధిగా అంటించుకొని బ్లాక్ లేదా బ్లూ పాయింట్ పెన్నును మాత్రమే అనుమతిస్తారు. చేతిగడియారం, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు. అభ్యర్థులు బయోమెట్రిక్ హాజరును విధిగా వేయాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ముగిసే వరకు అభ్యర్థులను బయటికి రానివ్వారు.