కోమటిరెడ్డి బ్రదర్స్ తోడు దొంగలని, ప్రజా సంక్షేమం పట్టని ఆ ఇద్దరిని నల్లగొండ జిల్లా ప్రజలు నమ్మబోరని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. 20 వేల కోట్ల రూపాయల బొగ్గు గనుల కాంట్రాక్టు కోసం రాజగోపాల్రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టాడని ఆరోపించారు. ఏనాడూ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడని ఆయన ఈ రోజు నీతులు వల్లిస్తుండడం చూసి మునుగోడు ప్రజలు నవ్వుకుంటున్నారని, కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి గురువారం ఆయన 372 మందికి రూ.1.32 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
నల్లగొండ, ఆగస్టు 4 : ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సోదరులను నల్లగొండ ప్రజలు నమ్మబోరని ఇద్దరూ తోడు దొంగలేనని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి నల్లగొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 372 మందికి రూ.1.32కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేశారు. ఈ సందర్భంగా కిశోర్కుమార్ మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్కు ఏనాడు ప్రజల సంక్షేమం పట్టలేదన్నారు. రాజగోపాల్రెడ్డి రూ.20 వేల కోట్ల బొగ్గు గనుల కాంట్రాక్ట్ కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టినట్లు తెలిపారు.
ఏనాడూ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడని రాజగోపాల్రెడ్డి ఇవాళ టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ నీతులు చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. జార్ఖండ్లో 25 సంవత్సరాల పాటు బొగ్గు గనులు లీజుకు తీసుకుని బీజేపీకి అమ్ముడుపోయిన నీచుడిగా ఆయనను అభివర్ణించారు. ఇక అన్న వెంకట్రెడ్డి సైతం తక్కువేమి తినలేదని నల్లగొండ నియోజకవర్గంలో 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసిండో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. నల్లగొండను అథోగతి పాలు చేసి ఒక్క సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలు లో వోల్టేజీతో ఇబ్బంది పడ్డట్లు తెలిపారు.
ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడంలో కోమటిరెడ్డి సోదరులకు మించిన వారు తెలంగాణలోనే లేరన్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 5 వేల మందికి రూ.24 కోట్ల ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. నల్లగొండ పట్టణాన్ని సీఎం కేసీఆర్ సహకారంతో ఎంతో అందంగా తీ ర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, కనగల్ ఎంపీపీ, జడ్పీటీసీ కరీంపాషా, చిట్ల వెంకటేశం, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, సుంకరి మల్లేశ్గౌడ్, కటికం సత్తయ్యగౌడ్, అభిమన్యు శ్రీనివాస్, పాశం సంపత్రెడ్డి, వం గాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, దేప వెంకట్రెడ్డి,ఐతగోని యాదయ్య, కంచనపల్లి రవీందర్రావు, గాదె రాంరెడ్డి, బోనగిరి దేవేందర్, కందుల లక్ష్మయ్య పాల్గొన్నారు.