తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడంతో ఊరు దశ దిశ మారుతున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాసాలమర్రికి ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. దళిత బంధు కూడా అన్ని దళిత కుటుంబాలకు అందించడంతో సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండ్లు కట్టించాలనే లక్ష్యంతో సర్కారు ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా అధికారులు గ్రామాన్ని పూర్తి సర్వే చేశారు. పాత ఇండ్లను పూర్తిగా తొలగించనున్నారు. ఈ స్థలంలో లేఅవుట్ రూపొందించి, కొత్తగా 481 కుటుంబాలకు ఇండ్లు కట్టించాలని అధికారులు ప్రతిపాదించారు. 191 గ్రౌండ్ ఫ్లోర్, 145 జీ+వన్ బిల్డింగ్స్ నిర్మించనున్నారు. దీంతో ఇక ఊరిలో మొత్తం పక్కా ఇండ్లే దర్శనమివ్వనున్నాయి. పాత మిద్దె ఇండ్లు, పెంకుటిండ్లు, గుడిసెలు కనుమరుగు కానున్నాయి. ఇప్పటికే పటిష్టంగా ఉన్న 100 ఇండ్లను మాత్రం అలాగే ఉంచనున్నారు. ఈ ఇండ్లకు రెనోవేషన్ కోసం విజ్ఞప్తి చేస్తే దానికి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
– యాదాద్రి భువనగిరి, జూలై 15(నమస్తే తెలంగాణ)
సర్కారు బిల్డింగ్లూ కొత్తవే..
ఇక ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, హాస్పిటల్, కమ్యూనిటీ బిల్డింగ్స్ ఇతర అన్నీ కొత్తగా కొలువుదీరనున్నాయి. 5 అంగన్వాడీ భవనాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కిచెన్ అండ్ డైనింగ్తో కూడిన ప్రైమరీ స్కూల్ బిల్డింగ్, హైస్కూల్ బిల్డింగులు వేర్వేరుగా నిర్మించనున్నారు. ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్, కిచెన్ అండ్ డైనింగ్తో కూడిన కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయతీ బిల్డింగ్, వెటర్నరీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇవే కాకుండా ఇంటిగ్రేటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఇక్కడ 12 షాపులు ఒకే దగ్గర ఉండనున్నాయి.
ఎవరికీ నష్టం జరుగకుండా చర్యలు
ప్రస్తుతం పాత ఇండ్లను తొలగించి, కొత్తగా కట్టే సమయంలో కొందరికి ఓపెన్ ప్లేస్ కోల్పోయే అవకాశం లేకపోలేదు. ఇలా నష్టపోకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వీరికి మరో చోట స్థలం అడ్జస్ట్ చేయనున్నారు. ఓపెన్ ప్లాట్ పోయినోళ్లకు కూడా ప్రత్యేకంగా స్థలం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఊరికి దగ్గరలో 12 ఎకరాల 30 గుంటల స్థలం ఉంది. దీన్ని గ్రామస్తులు ఇప్పటికే పరిశీలించి బాగుందని అందరూ ఓకే చెప్పారు. ఈ స్థలంలో 114ప్లాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఊరిలో స్థలం కోల్పోయిన వారికి ఊరి బయట పరిహారం కింద ఇవ్వనున్నారు. ఇక్కడ కూడా డ్రైనేజీ, రోడ్లు, కరెంట్ అన్ని వసతులు కల్పించనున్నారు.
మోడల్ విలేజ్గా వాసాలమర్రి
వాసామర్రి ప్రజలు అదృష్టవంతులు. సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడం గొప్ప విషయం. కేవలం ఇండ్లు కాకుండా ఉపాధి అవకాశాలు, ఆర్థికంగా ఎదుగాలని ఇక్కడే దళిత బంధు పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. పేదలకు సొంతంగా ఇండ్లు కట్టించడమే కాకుండా సర్వహంగులతో వసతులు ఏర్పాటు కానున్నాయి. ఇంటిపై సింటెక్స్ కూడా ఏర్పాటు కానుంది. ఫంక్షన్లు, సమావేశాల కోసం 300మంది ఉండేలా మినీ ఫంక్షన్ హాల్కు ప్రతిపాదించాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా కొత్తగా నిర్మించేందుకు ప్లాన్ చేశాం. వాసామలమర్రి ఆవాసం మంచిరోనిమామిళ్లలో కూడా ఇండ్లను నిర్మిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్ విలేజ్గా రూపుదిద్దుకోనుంది.
-గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే
సకల సదుపాయాలు అందుబాటులో..
ఊరిలో అందరికీ ఇండ్లతోపాటు సర్కారు అన్ని రకాల సదుపాయాలను కల్పించనుంది. గల్లీగల్లీకి సీసీ రోడ్లు వేయనున్నారు. ఎక్కడికక్కడ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 24గంటలపాటు డ్రింకింగ్ వాటర్ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు. సెప్టిక్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఎలక్ట్రిసిటీ వ్యవస్థను తీసుకురానున్నారు. ట్రాన్స్ఫార్మర్లు, పోల్స్, ఎలక్ట్రికల్ వైర్లు తదితర అన్నీ కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. సెంట్రల్ లైటింగ్ వ్యవస్థతో ఊరంతా వెలుగులతో నిండిపోనుంది. ఇట్ల గ్రామానికి అవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్నారు.
ఊరికి కొత్త కళ రానుంది
సీఎం కేసీఆర్ గ్రామాన్ని కొత్తగా నిర్మించేందుకు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి గ్రామస్తులంతా ఏకవాక్య తీర్మానం చేయడంతో గ్రామ అభివద్ధికి నాంది పలికింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 200 గజాల స్థలంలో సుందరంగా ఇండ్లు నిర్మించనుండటం ఆనందంగా ఉంది. కొత్త సదుపాయాలతో గ్రామం రూపురేఖలు మారనున్నాయి.
-పలుగుల జనార్దన్, వాసాలమర్రి
కేసీఆర్ తండ్రి లెక్క ఆదుకుంటున్నరు..
సీఎం కేసీఆర్ తండ్రి లాగా ఆలోచించి మాకు కొత్త ఇండ్లు కట్టిస్తూ ఆదుకుంటున్నరు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉన్న ఒక్క పూరిల్లు ఓ వైపు కూలిపోయింది. కుటుంబసభ్యులం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నం. కేసీఆర్ సారు కొత్త ఇండ్లు ఇస్తే ఆయన మేలు ఎప్పటికీ మరిచిపోలేం. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
– సాయికుమార్, గ్రామస్తుడు,
వాసాలమర్రి