నల్లగొండ, జూలై 12 : బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు రుతుపవనాల ప్రభావంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఉద్యోగస్తులు మినహా ప్రజలు పెద్దగా బయటికి వెళ్లలేదు. అయితే ముసురు వర్షం కురువడంతో పెద్దగా నష్టం వాటిల్లలేదు. కానీ ఉష్ణోగ్రత తగ్గడంతో పాటు చలి గాలులు వీయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
తగ్గిన ఉష్ణోగ్రతలు
వారం రోజులుగా నైరుతి రుతు పవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అల్పపీడనం కూడా తోడవడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చలి తీవ్రత పెరిగింది. ఈ నెల 7న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.5డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలుగా నమోదైంది. వర్షాల నేపథ్యంలో మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 28.4 డిగ్రీలకు, కనిష్ఠం 20.4 డిగ్రీలకు పడిపోయింది. దానికి తోడు గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగి.. ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వెళ్లడానికి జంకుతున్నారు.
వర్షపాతం వివరాలు..
గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా కట్టంగూర్లో 28.3 మిల్లీమీటర్లు, చిట్యాలలో 28.0, మునుగోడులో 26.4, నార్కట్పల్లి 22.9, కేతేపల్లి 22.6, నకిరేకల్ 22.1, నల్లగొండ 17.3, చండూర్ 17.1, కనగల్ 16.9, శాలిగౌరారం 16.7, అనుముల 15.6, తిప్పర్తి 15.4, దేవరకొండ 14.6, నిడమనూరు 14.5, గుండ్లపల్లి 13.3, అడవిదేవులపల్లి 12.8, దామరచర్ల 12.3, గుర్రంపోడు 11.8, చందంపేట 11.7, త్రిపురారం 10.8, నాంపల్లి 9.7, చింతపల్లి 9.7, మిర్యాలగూడ 9.7, వేములపల్లి 9.0, నేరేడు గొమ్ము 8.0, పెద్దవూర 7.4, కొండమల్లే పల్లి 7.3, మర్రిగూడ 7.1, పీఏ పల్లి 5.5, మాడ్గుల పల్లి 3.5, తిరుమలగిరి (సాగర్)లో 3.5 మి.మీ.వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 431.1 మి.మీ. వర్షపాతం నమోదు కాగా సగటున 13.9 మి.మీ కురిసింది. ఈ సీజన్లో 137.0 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 269.8 మి.మీ కురిసి 97 శాతం అదనంగా నమోదైంది.