సూర్యాపేట టౌన్, జూలై 6 :వృద్ధాప్యంలో చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. 60 ఏండ్లు దాటితే ఒంట్లో సత్తువ లేక పని చేయలేరు.. మరోవైపు కుటుంబ సభ్యులు ఉన్నా ఆదరణకు నోచని వారూ ఉన్నారు.. అలాంటి వారికి కొండంత అండగా ఉంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. నెలకు రూ.2,016 ఆసరా పింఛన్ ఇస్తున్నది. ప్రతినెలా రూపాయికే కిలో రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నది. రైతు బంధు కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు అందిస్తున్నది. పంటల సాగుకు పుష్కలంగా నీళ్లు, కరెంట్ ఉండడంతో ఏడాదికి ఎకరంలో రూ.20 వేల ఆదాయం వస్తున్నది. ఇలా ఎకరం ఉన్న వృద్ధులకు ఏడాదికి సుమారు రూ.54 వేలు చేతికి అందుతున్నది. గత ప్రభుత్వాల కాలంలో బుక్కెడు బువ్వ కోసం వెంపర్లాడిన వృద్ధులు స్వరాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ ఫలాలతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు.
నాడు 200.. నేడు 2,016
గత ప్రభుత్వంలో వృద్ధాప్య పింఛన్ రూ.200 ఉండగా సీఎం కేసీఆర్ రూ.2016కు పెంచారు. చేనేత, గౌడలకు 50 ఏండ్లకు, మిగతా వారికి 60 ఏండ్లు దాటిన వారికి పింఛన్ ఇస్తున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య పింఛన్ తీసుకునే వారు 1.22 లక్షల మంది ఉన్నారు. నాడు కొడుకులు, కూతుళ్ల సహకారంతో బతికిన వృద్ధులు పెరిగిన పింఛన్తో స్వతహాగా జీవిస్తున్నారు. ఆహారం, మందుల అవసరాలు తీర్చుకుంటున్నారు. మనమలు, మనమరాల్ల చిరుతిండ్లకు డబ్బు కూడా ఇచ్చే స్థాయికి వచ్చారు.
నెలనెలా డబ్బు
రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందిస్తున్న డబ్బుతో వృద్ధులకు ఎంతో లబ్ధి చేకూరుతున్నది. సూర్యాపేట జిల్లాలో ఒక ఎకరంలోపు ఉన్న వృద్ధులు సుమారు 39వేల మంది ఉండగా వీరికి ఏడాదికి రెండు పంటలకు రూ.10 వేలు అందుతున్నాయి. వీరికి నెలకు రూ.2 వేల పింఛన్ చొప్పున ఏడాదికి రూ.24వేలు వస్తున్నాయి. సొంతంగా పండించుకుంటే ఎకరాకు రూ.40 వేలు, కౌలుకు ఇస్తే రూ.20 వేల ఆదాయం వస్తున్నది. సుమారుగా ఏడాదికి ఒక వృద్ధ రైతుకు రూ.54 వేలు సమకూరుతున్నది. నాడు దుర్భర జీవితాలను అనుభవించిన వృద్ధులు సీఎం కేసీఆర్ సహకారంతో సంతోషంగా ఉంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఊర్లన్నీ పచ్చగా మారుతాయని, వృద్ధులకు గౌరవం పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. చేతిలో డబ్బు ఉండడంతో తమను కుటుంబ సభ్యులు మంచిగా చూసుకుంటున్నట్లు వృద్ధులు చెబుతున్నారు.
గౌరవంగా బతుకుతున్నా..
గతంలో 200 పెన్షన్ ఇచ్చినారు. ఆ డబ్బులు ఎటూ సరిపోకపోయేది. అప్పుడు రైతు బంధు కూడా లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వృద్ధులకు ఎంతో మేలు జరుగుతున్నది. నాకు ఎకరం భూమి ఉన్నది. రైతుబంధు ద్వారా ఏడాదికి 10 వేల రూపాయలు వస్తున్నాయి. ఇప్పటివరకు 8సార్లు రైతుబంధు తీసుకున్నా. నాకు నెలకు రూ.2 వేల పింఛన్ కూడా వస్తున్నది. కుటుంబ అవసరాలు, పంట పెట్టుబడులకు ఇవి సరిపోతున్నాయి. సమాజంలో గౌరవంగా బతుకుతున్నాం. ప్రభుత్వ సహకారం మరువలేనిది.
– కె. సీతమ్మ, రైతు, మఠంపల్లి
పైసలకు ఇబ్బంది లేదు..
టీఆర్ఎస్ సర్కారు వచ్చినంకనే నా పొలానికి గోదావరి నీళ్లొస్తున్నాయి. అడివెంల శివారులో నాకు పెద్ద కాల్వ వెంబడే భూమింది. గతంలో నా భూమంతా పడావుగా ఉండేది. ఇప్పుడు పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. నాలుగేండ్లుగా వరి సాగు చేస్తున్నా. నాకు రైతుబంధు పథకం కింద ఏడాదికి 10 వేల రూపాయల పెట్టుబడి సాయం అందుతున్నది. ప్రతినెలా ఆసరా పథకం కింద 2 వేల రూపాయలు పింఛన్ వస్తున్నది. ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నారు. మా కుటుంబం మొత్తానికి ఏడాది పొడవునా చేతినిండా పని దొరుకుతున్నది. పైసలకు ఇబ్బంది లేదు.
–జాల రామనర్సయ్య, రైతు, అడివెంల, అర్వపల్లి మండలం