కనుచూపు మేరలో కృష్ణమ్మ ఉన్నా అక్కడి భూమి తడువాలంటే వాన పడాల్సిందే! అక్కడ పంట పండిందంటే ఆ కారు రైతన్న గట్టెక్కినట్టే!! పూర్తి వర్షాధార సాగు ప్రాంతమైన నేరేడుగొమ్ము రైతాంగం కష్టాలను గట్టెక్కించేందుకు సాక్షాత్తూ గంగమ్మే అంబా భవానీ రూపంలో వస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు చిన్నమునిగల్ ప్రాంతంలో శిలాఫలకం వేసుకున్న ఎత్తిపోతల పనులు చకచకా సాగుతున్నాయి. రూ.186కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల అందుబాటులోకి వస్తే నేరేడుగొమ్ము మండలంలోని 7 గ్రామాల పరిధిలో 13,048 ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. కండ్ల ముందు కాల్వ పనులు సాగుతుండడం చూసి రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
అవి కృష్ణా వెనుక జలాలను ఆనుకొని ఉన్న గ్రామాలు. కనుచూపు మేరలో కృష్ణమ్మ కనిపిస్తున్నా పంటలకు నీరందే పరిస్థితి మాత్రం లేదు. దీంతో ఆయా గ్రామాల రైతులు వర్షాలపైనే ఆధారపడి పంటలు సాగు చేసుకునేవారు. వారి ఇబ్బందులు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాంతంలో లిఫ్టు నిర్మాణం చేపట్టారు. అది పూర్తయితే ఆ ప్రాంతం పచ్చని పంటలతో సస్యశ్యామలం కానుంది.
కరువు ప్రాంతంలో జల సిరులు..
నేరేడుగొమ్ము మండలంలోని రైతులది కృష్ణా వెనుక జలాలు చెంతనే ఉన్నా వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేసుకునే పరిస్థితి. వర్షాలు ముఖం చాటేసిన సందర్భాల్లో పంటలు పండక తీవ్రంగా నష్టపోయేవారు. సరైన వర్షాలు పడక కొన్ని సందర్భాల్లో భూములను పడావు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. తెలంగాణ తొలి హోంశాఖ మంత్రిగా పనిచేసిన స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డిపై ఉన్న ఆత్మీయ అనుబంధంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా హాలియా సభలో అంబాభవాని లిఫ్టు ఏర్పాటు చేసి ఆ ప్రాంత భూములకు సాగు నీరు అందిస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నేరేడుగొమ్ము మండలంలోని చిన్నమునిగల్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న అంబాభవానీ లిఫ్టు అందుబాటులోకి వస్తే 13,048 ఎకరాలు సాగులోకి రానున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్..
హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ అంబాభవానీ లిఫ్టు ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఆ వెంటనే లిఫ్టు ఏర్పాటు కోసం రూ.186 కోట్లు కేటాయించారు. ఇప్పటికే బ్యాక్ వాటర్ నుంచి లిఫ్టు ఏర్పాటు చేసే ప్రాంతం వరకు అర కిలోమీటరు మేర 20 మీటర్ల లోతు కాల్వ తవ్వకం పూర్తయింది. ఈ లిఫ్టుతో మండలంలోని పెద్దమునిగల్, చిన్న మునిగల్, బుగ్గతండా, కొత్తపల్లి, మోసంగడ్డతండా, బచ్చాపురం, గుర్రపుతండా పరిధిలోని భూములకు సాగు నీరు అందనుంది.
త్వరలో మరిన్ని లిఫ్టుల పనులు..
ఈ ప్రాంత రైతుల సాగు నీటి సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను. ఈ తరుణంలోనే సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా హాలియాలో జరిగిన బహిరంగ సభలో అంబాభవానీ లిఫ్టు ఏర్పాటుపై ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. రూ.186 కోట్లు కేటాయించడంతో లిఫ్టు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే కాల్వ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే దేవరకొండ నియోజకవర్గంలో మరిన్ని లిఫ్టుల పనులు ప్రారంభం కానున్నాయి.
– రమావత్ రవీంద్రకుమార్, దేవరకొండ ఎమ్మెల్యే
సీఎం సార్కు కృతజ్ఞతలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వాగ్దానం మేరకు అంబాభవాని లిఫ్టు మంజూరు చేశారు. పనులు చురుగ్గా జరుగుతున్నాయి. లిఫ్టు అందుబాటులోకి వస్తే వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. సీఎం కేసీఆర్కు ఇక్కడి రైతాంగం రుణపడి ఉంటారు.
– కేతావత్ రవీంద్ర, పెద్దమునిగల్
పంటలు సమృద్ధిగా పండుతాయి..
అంబాభవాని లిఫ్టు అందుబాటులోకి వస్తే పంటలు సంవృద్ధిగా పండుతాయి. ఇన్నాళ్లు వర్షాలపై ఆధారపడిన ఇక్కడి రైతాంగానికి అంబాభవాని లిఫ్టు ఒక వరం కానుంది. ఇక్కడి రైతుల సమస్యను అర్థం చేసుకొని అంబాభవాని లిఫ్టును మంజూరు చేసిన సీఎంకు రైతుల పక్షాన కృతజ్ఞతలు.
– కేతావత్ బిక్యానాయక్, చిన్న మునిగల్
పనులు పురోగతిలో ఉన్నాయి
అంబాభవాని లిఫ్టు పనులు పురోగతిలో ఉన్నాయి. లిఫ్టు పనులు పూర్తయితే ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరుగనుంది. లిఫ్టు ఏర్పాటుతో ఏడు గ్రామాల్లోని సుమారు 13,048 ఎకరాలు సాగులోకి రానున్నాయి.
– శివరాజ్, ఇరిగేషన్ ఏఈ