దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, దేశ చరిత్రలో విప్లవాత్మకమైన పథకంతో సామాజిక మార్పు మొదలైందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు మండలం జమస్తాన్పల్లి,సంస్థాన్నారాయణపురం మండలం చిమిర్యాల, గుడిమల్కాపురం గ్రామాల్లో 100 మందికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి దళిత బంధు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ గ్రామాలతోపాటు చౌటుప్పట్ మండలాల లబ్ధిదారులు 200 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. ఉదయం నుంచి వర్షం వస్తున్నా మంత్రి ఆయా మండలాల్లో పర్యటించారు. డప్పు చప్పుళ్లు, కోలాటాల మధ్య ప్రజలు మంగళహారతులతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా నేరుగా 10లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారని, లబ్ధిదారులు వినియోగించుకొని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని అన్నారు. కూలీల నుంచి ఓనర్లుగా మారాలని ఆకాంక్షించారు. దళిత బంధు యూనిట్లు అందుకున్న లబ్ధిదారులు సంతోషంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
మునుగోడు, జూలై 3 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని జమస్తాన్పల్లి గ్రామంలో ఆదివారం దళితబంధు యూనిట్లు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ మంత్రి పర్యటనకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓ వైపు వానజల్లులు, మరోవైపు కార్యకర్తల పూలజల్లులతో మంత్రి జగదీశ్రెడ్డికి ఘనస్వాగతం పలికారు. గ్రామంలో దళితబంధు పథకం కింద ఎంపికైన 39 మంది లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు. ప్రభుత్వం కల్పించిన చేయూతను సద్వినియోగం చేసుకొని ఆర్థిక సమృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రి పర్యటన సందర్భంగా నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి, ఎంపీడీఓ యాకూబ్ నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, వైస్ ఎంపీపీ అనంత వీణ, సర్పంచ్ పంతంగి పద్మ, నాయకులు దాడి శ్రీనివాస్రెడ్డి, భవనం శ్రీనివాస్రెడ్డి, లాల్బహదూర్గౌడ్, మందుల సత్యం, మారేశ్ పాల్గొన్నారు.
విద్యను మించిన ఆయుధం లేదు
సూర్యాపేట టౌన్, జూలై 3 : సమాజంలో విద్యను మించిన ఆయుధం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట 9వ వార్డులో అమ్మానాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7, 8, 9, 24 వార్డుల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలంతా పాఠశాలలో చేరి మంచి విద్యాబుద్ధ్దులు అలవర్చుకుని..ప్రతి ఇంటా విజ్ఞాన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థ్ధి పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులు, సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదువడం అలవాటు చేసుకుని భవిష్యత్లో మంచి స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన అమ్మానాన్న ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితా ఆనంద్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, అమ్మానాన్న ఫౌండేషన్ సభ్యులు పెరుమాళ్ల శ్రీనివాస్, రాంబాయి పాల్గొన్నారు.
దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
సంస్థాన్ నారాయణపురం : దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకం చేపట్టారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని చిమిర్యాల, గుడిమల్కాపురం గ్రామాల్లో కల్యాణలక్ష్మి, దళితబంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఆదివారం పాల్గొన్నారు. గుడిమల్కాపురం గ్రామానికి చెందిన 26 మందికి, చిమిర్యాల గ్రామానికి చెందిన 35మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లు కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. దళితబంధు యూనిట్ల పంపిణీకి వచ్చిన మంత్రి జగదీశ్రెడ్డికి ప్రజలు డప్పుచప్పుళ్లతో స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారంటీలు లేకుండానే నేరుగా లబ్ధిదారులకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించే పథకం దేశంలోనే మరెక్కడా లేదన్నారు. కూలీల నుంచి ఓనర్లుగా సక్సెస్ ఫుల్ వ్యాపార వేత్తలుగా ఎదుగాలని ఆకాంక్షించారు. చిమిర్యాల గ్రామంలో లబ్ధిదారులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. అంతకుముందు దళితబంధు యూని ట్లు పంపిణీ చేస్తూ మంత్రి స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతిగౌడ్ పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
చౌటుప్పల్ రూరల్ : మండలంలోని దామెర బాలాజీ గార్డెన్లో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల 200మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంత్రి జగదీశ్రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సొంత ఖర్చుతో చీరెలు పంపిణీ చేశారు. ఆర్డీఓ సూరజ్కుమార్, మున్సిపల్ చైర్మన్ రాజు పాల్గొన్నారు.