గొర్రెలు, మేకలు వానకాలంలో అనేక రోగాలకు గురవుతుంటాయి. వర్షాకాలంలో లేత గడ్డిని తినడం, కలుషితమైన నీటిని తాగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావంతో రోగాల బారిన పడుతుంటాయి. ముందుగా గుర్తించపోతే జబ్బు ముదిరి జీవాలు మృత్యువాత పడుతుంటాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే జీవాలను రోగాల బారి నుంచి కాపాడుకోవచ్చని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. జీవాలకు ముఖ్యంగా బ్యాక్టీరియా వల్ల డెక్కవాపు వ్యాధి, చిటుక రోగం వస్తాయి. వైరస్ వల్ల నీలి నాలుక వ్యాధి, పారుడు రోగం, గాలికుంటు వ్యాధులు సోకుతాయి.
డెక్కవాపు వ్యాధి లక్షణాలు..
డైకిలోబాక్టర్ నోడోసన్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఇది అంటు రోగం. ఈ వ్యాధి వల్ల కాలి డెక్కలు వాయడం, మొదట్లో కాలి డెక్కల మధ్యలో చిన్న చిన్న కురుపులు ఏర్పడి అవి పగిలిపోయి చీము కారడం వల్ల తీవ్రమైన నొప్పితో జీవాలు నడవలేక పోతాయి. కుంటడం, మేత తినకపోవడం, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స : వ్యాధి సోకిన గొర్రెలు, మేకలను మంద నుంచి వేరు చేయాలి. డెక్కలను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి జింక్ పౌడర్ వేయాలి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే 5-6 రోజులు పెన్సిలిన్ ఇంజెక్షన్ చేస్తే వ్యాధి నయం అవుతుంది.
చిటుక రోగం :
ఈ వ్యాధిని గడ్డిరోగం, నెత్తిపిడుగు, పాటు రోగం కూడా అంటారు. ఈ వ్యాధి క్లాస్ట్రీడియం పర్పున్జెన్స్ టైప్-డీ అనే బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. తొలకరి గడ్డి అధికంగా తినడం వల్ల ఇది వస్తుంది. ఈ వ్యాధి సోకితే చిటికెలోనే జీవాలు మృత్యువాత పడుతాయి. అందుకే దీనిని చిటుక వ్యాధి అని పిలుస్తారు. ఈ బ్యాక్టీరియా జీవాల పేగుల్లోని గాలి లేని ప్రాంతంలో అభివృద్ధి చెందుతాయి. అవి వదిలిన విష పదార్థాలు చిటుక వ్యాధికి కారణమవుతాయి.
చికిత్స : చిటుక వ్యాధి నివారణకు జీవాలకు ముందుగానే ఈటీ టీకాలు వేయించాలి. నట్టల నివారణ మందు తాగించాలి.
నీలి నాలుక వ్యాధి :
ఆర్బీ వైరస్ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా క్యూలీకాయిడిస్ అనే దోమ వల్ల గొర్రెలు, మేకలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇది సోకిన జీవాల్లో నాలుక వాపు రావడం, రంగు మారడం, నోటిలో కురుపులు రావడం, సొల్లు కార్చడం, అధిక జ్వరం, మేత తినకపోవడం వంటి లక్షణాలు జీవాల్లో కనిపిస్తాయి.
చికిత్స : ఈ వ్యాధి సోకకుండా ముందుగానే జీవాలకు బ్లూటంగ్ టీకాలు వేయించాలి. దోమలు లేకుండా దొడ్డి చుట్టూ దోమ తెరలు ఏర్పాటు చేయాలి. సైపర్మెత్రిన్ ద్రావణాన్ని దొడ్డిలో స్ప్రే చేయాలి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే పశువైద్యాధికారిని సంప్రదించాలి.
వర్షాకాలంలో దొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం, గోమార్ల మందు స్ప్రే చేయడం, దోమ తెరలు ఏర్పాటు చేయడం, తెల్ల సున్నం చల్లడం వల్ల కొంత మేర రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. చికిత్స కంటే వ్యాధి నివారణ చర్యలు ఎంతో ముఖ్యం. జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్ల బారిన పడకుండా జీవాలను కాపాడుకోవచ్చు. ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో మల్టీ కాంపోనెంట్ ఈటీ అనే వ్యాధి నిరోధక వ్యాక్సిన్ను గొర్రెలు, మేకలన్నింటికీ వేయించాలి. రెండో విడుత టీకాలు అక్టోబర్, నవంబర్ నెలల మధ్యలో వేయాలి. ఇలాంటి జాగ్రత్తలతో వ్యాధులు రాకుండా జీవాలను కాపాడుకోవచ్చు.
పారుడు రోగం
ఈ వ్యాధి మార్బిలీ వైరస్ వల్ల సోకుతుంది. ఇది అంటు రోగం. ఈ రోగం వల్ల జీవాల్లో అధిక జ్వరం, మేత తినకపోవడం, నోటిలో పొక్కులు రావడం, సొల్లు కార్చడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స ఆలస్యమైతే మరణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చికిత్స : సరైన సమయంలో పీపీఆర్ టీకాలు వేస్తే ఈ వ్యాధిని నివారించడం సులభమవుతుంది. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే పశువైద్యాధికారిని సంప్రదించి సరైన మందులు వాడాలి.
గాలికుంటు వ్యాధి
ఆప్తో వైరస్ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ రోగం వచ్చిన గొర్రెలు, మేకల్లో అధిక జ్వరం, మేత తినకపోవడం, నోటిలో పొక్కులు, సొల్లు కారడం, డెక్క వాపు మరియు మూతి వాపు, కుంటడం, నడవలేక పోవడం వంటి లక్షణాలు కనబడుతాయి.
చికిత్స : ముందస్తుగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించడం వల్ల ఈ వ్యాధిని జయించవచ్చు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే దగ్గరలోని పశు వైద్యాధికారిని సంప్రదించి సరైన మందులు వాడాలి.
ముందస్తు జాగ్రత్తలు పాటించాలి
వర్షాకాలం సీజన్లో గడ్డితోపాటు నీరు, గాలిలో పశువులకు రకరకాల వ్యాధులు కలుగజేసే క్రిమికీటకాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. దీంతో పాడి పశువులకు, గొర్రెలు, మేకలకు సీజనల్గా వ్యాధులు వ్యాపిస్తాయి. వానకాలం ప్రారంభంలో పచ్చిగడ్డిని తినడం వల్ల పశువుల కడుపులోకి పరాన్న జీవులు చేరి చిటుక వ్యాధి, దొమ్మ రోగం ప్రబలుతాయి. ఈ వ్యాధి సోకిన జీవాలు అతితక్కువ సమయంలోనే మృతి చెందుతాయి. ముందస్తుగా నివారణ చర్యలు తీసుకుంటే పశు సంపదను రోగాల బారి నుంచి కాపాడుకోవచ్చు. పశువులు, జీవాలకు సీజన్కు ముందుగా టీకాలు వేయించాలి. టీకా వేయించిన 24 గంటల తరువాత అది పనిచేస్తుంది. రైతులు సొంత వైద్యం మానుకొని పశువైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే పశు మరణాలను నివారించవచ్చు. – నాగేంద్రబాబు, పశు వైద్యాధికారి, కోదాడ