39 కుటుంబాలు ఎంపిక..
జమస్తాన్పల్లి గ్రామ జనాభా 630. ఇందులో ఎస్సీ కుటుంబాలు 40 ఉండగా, 142 మంది జనాభా ఉన్నారు. వారంతా నిరుపేదలు. వారి దైన్యస్థితిని తెలుసుకున్న మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి దళితబంధు పథకం కింద జమస్తాన్పల్లిని ఎంపిక చేయించారు. దాంతో సంబంధిత అధికారులు గ్రామంలో సర్వే నిర్వహించి 39 కుటుంబాలను దళితబంధు కోసం ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా వారు ఎంచుకున్న స్వయం ఉపాధికి ప్రభుత్వం రూ.పది లక్షల ఆర్థిక సాయం అందజేసింది.
విభిన్న రంగాల యూనిట్లు
దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారులు తమ కుటుంబ నేపథ్యం, పని అనుభవం, అభిరుచులకు అనుగుణంగా విభిన్న ఉపాధి రంగాలను ఎంచుకున్నారు. ఎనిమిది మంది ట్రాక్టర్లు ఎంపిక చేసుకున్నారు. వారికి ట్రాక్టర్తోపాటు ట్రాలీ, డోజర్, ఇతర పనిముట్లు ఇవ్వనున్నారు. వస్తువులు రవాణా చేసే నాలుగు చక్రాల వాహనాలను ఆరుగురు, ప్యాసింజర్ వాహనాలను 11మంది, ఏడు సీట్ల ఆటోను ఒకరు, మినీ డెయిరీని ముగ్గురు, పౌల్ట్రీఫామ్ నలుగురు, టెంట్హౌస్ ఒకరు ఎంపిక చేసుకున్నారు. మరో ఇద్దరు సిమెంట్ ఇటుకల తయారీ, ఒకరు సెంట్రింగ్ మేకింగ్ యూనిట్ను ఎంచుకున్నారు. ఇద్దరు లబ్ధిదారులు కలిసి హార్వెస్టర్ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఇప్పటికే కొంత మంది తాము ఎంచుకున్న యూనిట్లను కొనుగోలు చేశారు.
స్వాతంత్య్రం వచ్చి ఇంతకాలమైనా ఆ గ్రామ దళితుల జీవితాలు ఏమాత్రమూ మారలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు వారి జీవితంలో వెలుగులు నింపుతున్నది. ఈ పథకం కింద ఎంపికైన మునుగోడు మండలం జమస్తాన్పల్లి, సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిమిర్యాల, గుడి మల్కాపురం గ్రామాల్లోని 100 మందికి నిధులు మంజూరయ్యాయి. వారు ఎంచుకున్న యూనిట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు.
పౌల్ట్రీఫామ్ ఏర్పాటు చేసుకుంటున్నా..
గతంలో ఎన్ని పథకాలొచ్చినా మా వర్గానికి తగిన న్యాయం చేకూరలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకానికి మా గ్రామాన్ని ఎంపిక చేయడం హర్షణీయం. గతంలో మోటారు రంగంలో ఒడిదుడుకులు ఎదుర్కొని తీవ్రంగా నష్టపోయాను. దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు సీఎం కేసీఆర్ వరంలా దళితబంధును తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో 6వేల కోళ్ల సామర్థ్యంతో పౌల్ట్రీఫామ్ను ఏర్పాటు చేసుకుంటున్నా. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ పథకాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– అందుగుల కృష్ణ, లబ్ధిదారుడు, జమస్తాన్పల్లి
దళితబంధు మా అదృష్టం
ఇంతకుముందు ఏ పాలకులూ మమ్మల్ని పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మా జీవితాల్లో మార్పులు వస్తున్నాయి. దళిత బంధు పథకం కింద జమస్తాన్పల్లిని ఎంపిక చేయడం మా అదృష్టం. దళిత బంధు డబ్బుతో కారు కొన్నాం. సీఎం కేసీఆర్ మా జీవితాల్లో వెలుగులు నింపడంతోపాటు భవిష్యత్తుకు భరోసా కల్పించారు. సారుకు జీవితాంతాం రుణపడి ఉంటాం.
– తుపాకి పార్వతమ్మ, లబ్ధిదారు, జమస్తాన్పల్లి
మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు
జమస్తాన్పల్లి గ్రామంలోని ఎస్సీలు నిరుపేదలు. ఇప్పటికీ చాలామంది దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. దళితబంధు పథకం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. ఈ పథకం కింద జమస్తాన్పల్లిని ఎంపిక చేయించిన మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి కృతజ్ఞతలు.
– కర్నాటి స్వామి, ఎంపీపీ, మునుగోడు