నల్లగొండ ప్రతినిధి, జూన్ 29(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోనే ఇప్పటివరకు అత్యధికంగా నల్లగొండ జిల్లా రైతులకే రైతుబంధు ప్రయోజనం కలుగుతున్నది. తొలిరోజూ ఉదయం 8 గంటల నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నట్లుగా టిక్టిక్ అంటూ మెస్సేజ్లు రావ డం మొదలైంది. ఎకరం లోపు ఉన్న రైతులందరికీ మంగళవారం రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి రోజు 2,83,066 మంది రైతులకు రూ. 86.64 కోట్ల నగదు ఖాతాల్లో జమైంది. ఇందులో ఒక్క నల్లగొండ జిల్లాలోనే రాష్ట్రంలోనే అత్యధికంగా 1,33,191 మంది రైతులకు గానూ 41.36 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందింది. తర్వాత ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉన్నది.
ఇక తొలిరోజు సూర్యాపేట జిల్లాలో మొత్తం 80,989 మంది రైతుల ఖాతాల్లో 25.77 కోట్ల రూపాయలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 68,886 మంది రైతులకు రూ. 19.50 కోట్లు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం జమ చేసింది. కాగా బుధవారం రెండో రోజు రెండు ఎకరాల లోపు రైతులకు పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ అయ్యింది. రెండో రోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,45,320 మంది రైతులకు గానూ రూ. 186.15 కోట్ల సాయంగా అందింది.
జిల్లాల వారీగా పరిశీలిస్తే…
నల్లగొండ జిల్లాలో రెండో రోజు 1,21,333 మంది రైతులకు గానూ రూ. 92.45 కోట్లు పెట్టుబడి సాయంగా ఖాతాల్లో జమ అయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 70,550 మంది రైతులకు రూ. 53.23 కోట్లు, యాదాద్రి జిల్లాలో 53,437 మంది రైతులకుగానూ రూ. 40.45 కోట్లు పెట్టుబడి సాయంగా అందింది. నేడు మూడెకరాలు సంబంధించిన రైతులకు రైతుబంధు సాయం ఖాతాల్లో జమ కానుంది. ఇలా దశలవారీగా మొత్తం పట్టాదారు పాసుపుస్తకం ఉండి వివరాలు అందజేసిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది.
ప్రతి సీజన్కూ పెరుగుతున్న సాయం
2018 వానకాలం సీజన్లో రైతుబంధు పథకం ప్రారంభం నుంచి ప్రతి సీజన్కు జిల్లా రైతులకు అందుతున్న సాయం అంతకంతకూ పెరుగుతూ వస్తున్నది. గత యాసంగితో పోల్చితే ఈ సీజన్లో రైతుల సంఖ్యతోపాటు వారికి అందనున్న సాయం కూడా మరింతగా పెరిగింది. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం ఈ సీజన్లో ఉమ్మడి జిల్లాలో మొత్తం రూ. 1,236 కోట్లు రైతులకు రైతుబంధు ద్వారా సాయం అందనుంది. ఓ వైపు రైతుబంధు డబ్బులు జమ చేస్తూనే వ్యవసాయశాఖ ద్వారా ఇంకా కొత్త రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుండడం విశేషం. ఈ నెల 22వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు పూర్తైన రైతులు సైతం దరకాస్తు చేసుకోవచ్చని వ్యవసాయశాఖలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహారిస్తున్న ఏఈఓలు విజ్ఞప్తి చేస్తున్నారు.