యాదాద్రి, జూన్ 29 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం స్వామి, అమ్మవార్లకు అర్చకులు వైభవంగా నిత్య పూజలు నిర్వహించారు. వేకువ జామున 3.30 గంటలకు నిత్యపూజలు ప్రారంభమయ్యాయి. స్వయంభువులకు ఆరాధనలు జరిపి పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు జరిపారు. ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి నిత్య తిరుకల్యాణోత్సవం చేపట్టారు. దేవేరులను ముస్తాబు చేసిన గజవాహనం పురవీధుల్లో ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ కల్యాణతంతు జరిపారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి ప్రధానాలయ ప్రాకారంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠింపజేశారు. మొదటగా స్వామివారికి సుదర్శన నారసింహహోమం జరిపారు.
సాయంత్రం స్వామివారికి తిరువారాధన, అలంకార జోడు సేవలు, దర్బార్ సేవను నిర్వహించారు. సువర్ణ పుష్పార్చనలో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి సహస్రనామార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామివారికి సహస్రనామార్చనలు జరిపారు. పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయ ప్రకారం జరిగాయి. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. బుధవారం శ్రీవారి ఖజానాకు రూ.11,11,068 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పోచంపల్లి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి ఆయన దైవ దర్శనం చేసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. దర్శనానంతరం అద్దాల వేద ఆశీర్వచనం ఇచ్చారు.