భువనగిరి కలెక్టరేట్, జూన్ 29 : విద్యార్థి దశ నుంచే నైపుణ్యాన్ని పెంచుకోవాలని, అప్పుడే ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ స్కిల్ లెవల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని వనరులు, ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయని, యువత సరైన రీతిలో వినియోగించుకుని స్థిర పడాలని సూచించారు. జిల్లాలో స్కిల్ రీసెర్చ్ నివేదికలు తయారు చేసేందుకు ఉదయ్పూర్, ఎంజీఎన్ఎఫ్ నుంచి ఒక్కొక్కరి చొప్పున కేటాయించినట్లు తెలిపారు. జిల్లా పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలపై నివేదికలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఉపేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.
మక్తా అనంతారం యూపీఎస్ స్వచ్ఛ విద్యాలయ పురస్కారం
బీబీనగర్, జూన్ 29 : మండలంలోని మక్తా అనంతారం గ్రామ ప్రభుత్వ పాఠశాల 2021-22 సంవత్సరానికి స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఎంపికైంది. కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ పురస్కారాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్వీ.రామరాజుకు అందజేశారు. పాఠశాలలో తాగునీరు, పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతపై పురస్కారానికి ఎంపిక చేసినట్లు వారు తెలిపారు.
పాఠశాల స్థాయి నుంచే గణాంకాలపై అవగాహన కల్పించాలి
భువనగిరి కలెక్టరేట్ : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు గణాంకాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. ప్రొఫెసర్ మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 16వ జాతీయ గణాంక దినోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. మహలనోబిస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వార్షిక గణాంక పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దీపక్తివారీ, శ్రీనివాస్రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి మాన్యనాయక్, డీఈఓ నర్సింహ, జిల్లా గణాంక అధికారి రాజ్యం, ఉప గణాంక అధికారి లక్ష్మణ్ పాల్గొన్నారు.