సూర్యాపేట, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకునే యువత కోసం నిర్వహించే అగ్నివీర్ రిక్రూట్మెంట్కు సూర్యాపేట వేదిక కానున్నది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 23 వరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు డిఫెన్స్ అధికారులు తెలిపారు. ఆర్మీలో జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఏవియేషన్, అమ్యూనేషన్, స్టోర్ కీపర్ వంటి ఆరు విభాగాల్లో ఎంపిక చేపట్టనున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అభ్యర్థులు రానున్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేటకు అరుదైన గౌరవం దక్కింది.
తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఈ సారి సూర్యాపేటలో జరుగనున్నది. గతంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ఓ ప్రహసనంగా ఉండేది. ఉమ్మడి నల్లగొండ జిల్లాగా ఉన్నప్పుడు అడపా, దడపా నిర్వహించే ర్యాలీలో పాల్గొనడం మారుమూల ప్రాంతాలకు చెందిన యువతీ, యువకులకు భారంగా ఉండేది. ప్రస్తుతం మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల యువతకు ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం సూర్యాపేట ఆతిథ్యం ఇవ్వనున్నది. ఆర్మీలో చేరి దేశసేవ చేయాలనుకునే మన ప్రాంత యువతకోసం మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఆరు నెలల క్రితం సూర్యాపేటలో ప్రీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహింపజేసిన విషయం విదితమే.
షెడ్యూల్ విడుదల
ఆర్మీ రిక్రూట్మెంట్పై డిఫెన్స్ అధికారులు మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన యువతకు సూర్యాపేటలో రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 23 వరకు 43 రోజుల పాటు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుగనున్నది. ఆర్మీలోని ఆరు విభాగాల్లో నిర్వహించే రిక్రూట్మెంట్ కోసం 17.5 నుంచి 23 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారు అర్హులు. జిల్లాల వారీగా ర్యాలీతో పాటు రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టనున్నారు.
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో..
సూర్యాపేటకు చెందిన కర్నల్ సంతోశ్బాబు మరణించిన సందర్భంలో ఆర్మీ ఉన్నతాధికారులు సూర్యాపేటకు తరలివచ్చారు. ఈ సందర్భంగా సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టాలనే విషయాన్ని ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కర్నల్ మనోజ్ కుమార్ దృష్టికి మంత్రి జగదీశ్రెడ్డి తీసుకెళ్లారు. స్పందించిన ఆర్మీ ఉన్నతాధికారులు సూర్యాపేటకు చెందిన ది సోల్జర్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో ఆరు నెలల క్రితం ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1962 మంది యువతీ యువకులు ఈ ర్యాలీలో పాల్గొనగా అందులో 274 మంది ఎంపికయ్యారు. వారికి ఇప్పటి వరకూ ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పిస్తున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి కృషి ఫలితంగా సూర్యాపేటలో
అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్కు డిఫెన్స్ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.