నల్లగొండ ప్రతినిధి, జూన్24(నమస్తే తెలంగాణ) :పర్యావరణానికే గాక సమస్త ప్రాణకోటిగా ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్పై ప్రభుత్వం సమరానికి సిద్ధమైంది. ప్లాస్టిక్ కారణంగా తలెత్తుతున్న అనేక అనర్థాల నేపథ్యంలో నిషేధానికి నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలికల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్తోపాటు 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ వినియోగాన్ని బంద్ పెట్టనున్నది. వచ్చే నెల ఒకటి నుంచి వాటి తయారీ, నిల్వ, రవాణా, అమ్మకం, వినియోగం.. ఏది చేసినా కఠిన చర్యలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల వారీగా అధికారులు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్లాస్టిక్ వినియోగం, అనర్ధాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు నిరంతర తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.500 నుంచి 25 వేల వరకూ జరిమానా విధించనున్నారు. ఈ ఏడాది చివరికల్లాపూర్తిస్థాయి నిషేధం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగనున్నారు.
పర్యావరణ పరంగా ఎన్నో అనర్థాలకు దారితీస్తున్న ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు మొదలయ్యాయి. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్లాస్టిక్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిషేధానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. గతేడాది ఆగష్టు 12వ తేదీన దీనిపై ప్రత్యేకంగా తీర్మానాన్ని ఆమోదిస్తూ అమలుకు ఆదేశించింది. ఈ మేరకు ప్లాస్టిక్పై సమరంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో చర్య లు చేపట్టేందుకు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం సిద్ధమైంది. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎన్.సత్యానారాయణ గురువారం అన్ని మున్సిపాలిటీలకు మార్గదర్శకాలతో కూడి న సర్క్యూలర్ను జారీ చేశారు. దీని ప్ర కారం ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లోనూ ప్లాస్టిక్పై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. అన్నిచోట్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులతో పాటు 120 మైక్రాన్ల కంటే మందం తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు, పేపర్ ప్లేట్లు, గ్లాసులు, పలు రకాల ప్లాస్టిక్ ఐటమ్స్పై చర్యలు తీసుకోనున్నారు.
నేటి నుంచే కార్యాచరణ..
ప్లాస్టిక్ నిషేధానికి శనివారం నుంచే కార్యాచరణ మొదలుకానున్నది. ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ కమిటీల ఏర్పాటుతో దీనికి శ్రీకారం చుడతారు. దీంతో పాటు వేస్ట్ మేనేజ్మెంట్ సెల్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందులోనూ పలువురిని సభ్యులుగా నియమిస్తారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. ముఖ్య కూడళ్లలో ప్లాస్టిక్ అనర్ధాలను వివరిస్తూ, నిషేధం అమలు విషయం తెలిసేలా బోర్డులు, బ్యానర్ల ఏర్పాటుతో పాటు కరపత్రాలను పంపిణీ చేస్తారు. ఈ నెల 30వ వరకు రోజూ ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో విస్త్రతంగా ప్రచారం నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నారు.
ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్..
నిషేధిత జాబితాలోకి వచ్చే ప్లాస్టిక్ వస్తువులపై నిరంతరం నిఘా కోసం మున్సిపాలిటీల వారీగా కార్యచరణ రూపొందించనున్నారు. అందులో భాగంగా ప్రతీ మున్సిపాలిటీలోనూ ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మున్సిపల్ కమిషనర్, పబ్లిక్ హెల్త్ అధికారి, శానిటరీ సూపర్వైజర్, సానిటరీ ఇన్స్ప్టెక్టర్, పోలీసు కానిస్టేబుల్, ఇద్దరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. వీరు నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు చేపట్టనున్నారు. జూలై 1న అన్ని చోట్ల విస్త్రతంగా తనిఖీలు చేసేలా ఆదేశిలిచ్చారు. వీరు వారంలో కనీసం రెండుమార్లు తనిఖీలు చేపట్టి తయారు చేసినా , రవాణా చేసినా, నిల్వ చేసినా, అమ్మినా, వినియోగించినా జరిమానాలు విధించాల్సి ఉంటుంది. రూ. 500 నుంచి 25 వేల వరకు జరిమానాలు విధించనున్నారు.
పలు కార్యక్రమాల నిర్వహణ..
ప్లాస్టిక్ నిషేధ చర్యల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టేలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. నిషేధంపై ప్రచార బోర్డులు, ఇతర రూపాల్లో విస్త్రత ప్రచారం కల్పించడంతో పాటు అతిక్రమించే వారికి జరిమానాలు విధించాల్సి ఉంటుంది. దీంతో పాటు నీటి వనరులు, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపునకు చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలి. దుకాణాల్లో వస్త్ర సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్లు, కార్పొరేట్ ఆఫీసుల్లోనూ వీటిని పూర్తిగా నిషేధిస్తూ ప్రజలను ప్రత్యామ్నాయాల వైపు మళ్లించేలా చూడాలి. కార్పొరేట్ సంస్థలు సీఆర్ఆర్లో భాగంగా ప్రత్యామ్నాయ బ్యాగులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలి. దీంతో పాటు ప్లాస్టిక్ నిల్వ చేసే అవకాశాలున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి. వీటిన్నింటిపై ప్రతీవారం మున్సిపాలిటీల వారీగా నివేదికలు అందజేయాలి. నెలవారీగా ప్రతి నెల మొదటివారంలో ప్లాస్టిక్ నిషేధంపై నివేదికను వెల్లడించాల్సి ఉంటుంది. అంతిమంగా ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి వంద శాతం నిషేధం అమలయ్యే విధంగా నిరంతరం కార్యాచరణ కొనసాగించాలి.
జూలై 1 నుంచి పూర్తి నిషేధం
రాష్ట్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుంచి సింగిల్ యూజ్తో పాటు 120 మైక్రాన్ల కంటే మందం తక్కువ ఉన్న ప్లాస్టిక్పై నిషేధం విధించింది. దీనిపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాం. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించే అవకాశాలున్న కేంద్రాలపై దృష్టి సారిస్తున్నాం. స్ట్రీట్ వెండర్లు, హోటళ్లు, పెద్ద షాపులు ఇలా విభజించి తనిఖీలు చేస్తాం. వీటిని అమ్మినా, కొన్నా, వినియోగించినా జరిమానాలు విధిస్తాం. రూ.500 నుంచి 50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. జీరో వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టి సారిస్తూనే నిషేధిత ప్లాస్టిక్పై చర్యలు చేపడతాం.
– రమణాచారి, మున్సిపల్ కమిషనర్, నల్లగొండ
శుభ పరిణామం..
ప్లాస్టిక్ ఎన్నో అనర్థాలకు కారణమని నిర్ధారణ అయింది. క్యాన్సర్ లాంటి వ్యాధులకు మూలం. ప్లాస్టిక్తో భూమి, నీరు, గాలి కాలుష్యం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం శుభ పరిణామం. దీన్ని ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాలి. ప్లాస్టిక్ స్పూన్లు, బెలూన్లు, పేట్లు, గ్లాసులు, ధర్మకోలు పేట్లు ఇలా 16 రకాల సింగిల్ యూజ్ వస్తువులపై నిషేధం విధించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ వస్తువులపైనా దృష్టి సారించాలి. జూట్, క్లాత్ బ్యాగ్ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. అందర్నీ భాగస్వామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
– ఎం.సురేశ్గుప్తా, పర్యావరణవేత్త, నల్లగొండ
ఎకో ఫ్రెండ్లీకి సిద్ధం
ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఎకో ఫ్రెండ్లీ ఉత్పతులను అందించేందుకే అన్నెపర్తిలో 2014లో వాయుపుత్ర ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కంపెనీని ఏర్పాటు చేశా. కరోనాతో ఇబ్బందుల వల్ల పరిశ్రమ కొంత కుంటుపడింది. ప్రస్తుతం అధికారులు సహకరిస్తే పూర్తిస్థాయిలో నడిపేందుకు సిద్ధం. ప్లాస్టిక్తో ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో ఏకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు అందిస్తాం. తమ కంపెనీ ఉత్పత్తులను కూడా మహిళా సంఘాల ద్వారా విక్రయించాలని భావిస్తున్నాం. దీని వల్ల వారికి కూడా ఆర్థిక తోడ్పాటు లభిస్తుంది. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులు మార్కెట్కు అందించడమే మా లక్ష్యం.
– గగ్గెనపల్లి సందీప్రెడ్డి, నల్లగొండ