రామగిరి, జూన్ 24 ;ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏకైక మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్నది. గడియారం సెంటర్ సమీపం రామగిరిలో ఉన్న కాలేజీ ఎంతో మంది విద్యార్థినులకు ఉన్నత విద్య అందిస్తున్నది. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు, సకల వసతులు అందుబాటులో ఉండడంతో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించింది. దోస్త్ అడ్మిషన్లలో తొలి విడుతలోనే సీట్లు పూర్తిగా భర్తీ అవుతుండటం ఈ కళాశాల ప్రత్యేకత. నిపుణులైన అధ్యాపకులు ఉండడంతో విద్యార్థినులు వివిధ పోటీ పరీక్షల్లో రాణిస్తున్నారు. ఇటీవల కళాశాలకు న్యాక్ గ్రేడ్ -ఏ హోదా దక్కింది.
మూడు సార్లు న్యాక్ గ్రేడ్
మే, 2006లో తొలి పర్యాయం న్యాక్ ‘గ్రేడ్-బీ+’, సెప్టెంబర్ 2015లో న్యాక్ గ్రేడ్ -బీ సాధించింది. మూడోసారి ఏప్రిల్, 2022లో న్యాక్ గ్రేడ్ ఏ సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా న్యాక్ గ్రేడ్ ఏ ఉన్న మూడు కళాశాలల్లో ఇది ఒకటి. విద్యార్థుల సంఖ్య పెరుగడంతో తెలంగాణ రాష్ట్ర కాలేజ్ ఎట్ కమిషనర్ ఆదేశాలతో 7జూన్, 2018 నుంచి షిఫ్ట్ విధానంలో బోధన చేస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్ సబ్జెక్టులు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కామర్స్, సోషల్ సబ్జెక్టులు బోధిస్తున్నారు.
నైపుణ్యాలకు జిజ్ఞాస స్టడీ
రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించే ‘జిజ్ఞాస’ స్టడీ ప్రాజెక్టులో ఇక్కడ చదివే విద్యార్థులు ఎంపిక అవుతున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రాజెక్టులు తయారు చేసి సమర్పించడంతో రాష్ట్రస్థాయిలో నగుదు బహుమతులు సాధిస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో రాణించేలా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్లలో శిక్షణ అందిస్తున్నారు. ప్రతివారం ఆయా సబ్జెక్టుల్లో నిపుణులతో సెమినార్స్, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
1977లో కళాశాల ఏర్పాటు
1977 సంవత్సరంలో మహిళా ఉన్నత విద్యా వ్యాప్తికి నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఏ, బీకాం కోర్సులతో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. 1988-89లో బీఎస్సీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. 1993లో యూజీసీ నిధులకు కళాశాల అర్హత సాధించింది. నాణ్యమైన విద్యతో ప్రతియేటా ఎన్రోల్మెంట్లో ప్రగతి సాధిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఏర్పాటుతో 2011-12 విద్యా సంవత్సరంలో ఎంజీయూ అనుబంధంగా గుర్తింపులోకి వచ్చింది. 45 ఏండ్ల కింద 100 మంది విద్యార్థులతో కాలేజీ ప్రారంభం కాగా నేడు 2,478మంది విద్యార్థులతో కొనసాగుతున్నది.
అత్యాధునిక ల్యాబ్స్
విద్యార్థులకు విద్యతోపాటు ప్రాక్టికల్స్ నైపుణ్యాలు పెంచేలా ఆధునిక సైన్స్ ల్యాబ్స్ అందుబాటులోకి తెచ్చారు. నిత్యం ఆయా విభాగాల అధ్యాపకులు విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉండి సందేహాలు నివృత్తి చేస్తూ పోటీ ప్రపంచంలో రాణించేలా కృషి చేస్తున్నారు. తెలంగాణ స్కిల్ నాల్జెడ్ సెంటర్(టీఎస్కేసీ)లో కమ్యూనికేషన్ స్కిల్స్తోపాటు కంప్యూటర్ నాల్జెడ్ను అందిస్తున్నారు. శారీరక, మానసిక ప్రశాంతతకు యోగా, క్రీడలు నిర్వహిస్తున్నారు.
ప్రతి సంవత్సరం 920 మందికి అడ్మిషన్లు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని విద్యార్థులు ఈ కళాశాలలో ఎక్కువగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బీకాం, కంప్యూటర్ అఫ్లికేషన్స్ కోర్సుల్లో 2,478మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి ఏడాది దోస్త్ అడ్మిషన్లతో ప్రథమ సంవత్సరంలో 920 మంది చేరుతున్నారు. ఈ అడ్మిషన్లు తొలి విడుతలోనే పూర్తవుతున్నాయి.
25వేల పుస్తకాలతో డిజిటల్ లైబ్రరీ
కళాశాలలో చదివే విద్యార్థులకు 25వేల పుస్తకాలతో డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థి కళాశాల ఐడీ కార్డులోని క్యూఆర్ కోడ్, విద్యార్థి నంబర్తో లాగిన్ అయ్యి డిజిటల్ లైబ్రరీని కళాశాల గ్రంథాలయ అధ్యాపకుడు సుంకరి రాజారాం పర్యవేక్షణలో ఉపయోగించు కుంటున్నారు. మ్యాగజైన్స్, జర్నల్స్, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు ఇందులో ఉన్నాయి.
మొక్కలకు క్యూఆర్ కోడ్
బోటనీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కె.శ్రీనివాస్రెడ్డి పర్యవేక్షణలో ఔషధ, వివిధ రకాల మొక్కలతో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. నాటిన మొక్కలకు శాస్త్రీయ నామం, సాధారణ నామంతోపాటు క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఆ కోడ్ స్కాన్చేస్తే ఆ మొక్క ఉపయోగం తెలుసుకోవచ్చు. మొక్కల ఎరువుల కోసం ప్రత్యేకంగా వర్మీ కంపోస్టు షెడ్డును ఏర్పాటు చేశారు.
కళాశాలలో సకల వసతులు