యాదాద్రి, జూన్ 24 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు. స్వయంభూ ఆలయంలో సాయంత్రం ఊంజల్ సేవను నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రధానాలయంలోని వెలుపల ప్రాకారం అద్దాల మండపం ఊయలలో శయనింపు చేసి గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు పాడారు.
స్వయంభువుడికి నిత్యారాధనలు
స్వయంభువుడికి నిత్యారాధనలను అర్చకులు వైభవంగా చేపట్టారు. తెల్లవారుజాము 3గంటలకు నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. ఉదయం 4గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు. స్వామి వారి తిరువారాధన అనంతరం ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం స్వామికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వయంభువుల ప్రధానాలయంలోని ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ.600 టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు.
బంగారు పుష్పాలతో దేవేరులను అర్చించారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఆర్జిత పూజలు కోలాహలంగా జరిపించారు. ఉదయం సుదర్శన నారసింహ హోమం జరిపి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి దర్శనాలు కొనసాగాయి. సుమారు 18వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. శ్రీవారి ఖజానాకు రూ.23,24,402 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు.
అన్నదానానికి రూ.2లక్షల విరాళం..
స్వయంభువుడి ఆలయంలో అన్నదానానికి పలువురు దాతలు విరాళాలు సమర్పించారు. హైదరాబాద్కు చెందిన అవినాశ్కుమార్రెడ్డి, హర్ష మోహన్రెడ్డి రూ.2లక్షల విరాళాన్ని ఏఈఓ గజవెల్లి రమేశ్బాబుకు అందించారు.
శ్రీవారిని దర్శించుకున్న కోదాడ ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్
శ్రీవారిని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. మొదటగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపం వద్ద వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు స్వామివారి ప్రసాదం అందించారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్, టీఆర్ఎస్ యువజన విభాగం పట్టణాధ్యక్షుడు ముఖ్యర్ల సతీశ్యాదవ్, రైతుబంధు సమితి డైరెక్టర్ మిట్ట వెంకటయ్య ఉన్నారు.