యాదాద్రి, జూన్24 : చదువు, ఉద్యోగం, వ్యాపారం కోసమే కాకుండా పర్యాటక స్థలాలను చూసేందుకు జిల్లా నుంచి ఏటా అనేక మంది విదేశాలకు వెళ్తుంటారు. పాస్పోర్టు లభించాలంటే గతంలో జిల్లావాసులు హైదరాబాద్ వెళ్లి రెండు, మూడు రోజులు వేచి చూడాల్సి వచ్చేది. డబ్బులు కూడా ఖర్చయ్యేవి. ధ్రువపత్రాలు సరిగ్గా లేవని తిరిగి పంపేవారు. పోలీసుశాఖ పరిశీలన నెలల తరబడి చేసేవారు. 2019లో తెలంగాణలోనే తొలిసారిగా భువనగిరిలో ప్రాంతీయ పాస్పోర్టు సేవా కేంద్రం ఏర్పాటయ్యింది. అప్పటి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ దీనిని ప్రారంభించారు. భారతీయ విదేశీ మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ సంయుక్తంగా ఈ పాస్ పోర్టు కేంద్రాన్ని నిర్వహిస్తున్నాయి. స్లాట్ బుకింగ్ విధానంతో రోజుకు 40 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఎక్కువగా విదేశీ చదువులు, ఉద్యోగాల కోసం యువత పాస్ పోర్టులను ఉయోగించుకుంటున్నారు. వారంలో శని, ఆదివారాల్లో కార్యాలయానికి సెలవు కారణంగా స్లాట్ బుకింగ్ ఉండదు. స్లాట్ బుకింగ్ ఏ జిల్లా, రాష్ట్రం నుంచి అయినా చేసుకోవచ్చు. మూడున్నరేండ్లలో 32,716 పాస్పోర్టులు ఇచ్చారు.
పదిరోజుల్లో ఇంటికే పాస్పోర్టు ..
పుట్టిన పసిబిడ్డ నుంచి వయసు పైబడిన వారు సైతం పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. http:///www.passportindia.gov.in అనే చిరునామాలో ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ధ్రవపత్రాల పరిశీలన, దరఖాస్తుకు సంబంధించిన రోజు ఫోన్కు సమాచారం వస్తుంది. వచ్చిన సమాచారం బట్టి పాస్పోర్టు కేంద్రానికి రావాల్సి ఉంటుంది. చిరుమానా కోసం ఆధార్, విద్యార్హత ధ్రువపత్రాలు, పాన్కార్డు, పుట్టినతేదీ ఇతరత్రా పత్రాలను పరిశీలిస్తారు. తర్వాత పోలీసుశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తుదారుడి వ్యక్తిత్వం, ఏమైనా కేసులున్నాయా అని విచారణ చేస్తారు. అన్నీ అనుకూలంగా ఉంటే వారం, పది రోజుల్లోనే పాస్పోర్టును ఇంటి చిరునామాకు పంపిస్తారు.
సులభంగా పాస్పోర్ట్ పని జరిగింది
వచ్చే ఏడాది ఏప్రిల్లో జర్మనీ వెళ్లాలి. పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చాను. పాస్పోర్టు పరిశీలన చాలా సులభమైన పద్ధతిలో సాగింది. గతంలో పాస్పోర్టు కావాలంటే హైదరాబాద్కు వెళ్లేది. అక్కడ రెండు మూడు రోజులు వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు బాధలు తప్పినయి.
–శ్రీజ, సూర్యాపేట