రామగిరి, జూన్ 8 : టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో జగదీశ్వర్రెడ్డి సూచించారు. నల్లగొండలోని సెయింట్ ఆల్పోన్స్ హైస్కూల్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా టెట్ పరీక్ష విధుల్లో పాల్గొనే చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్టుమెంటల్, రూట్, రిపోర్టింగ్ అధికారులకు పరీక్ష నిర్వహణపై విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పేపర్-1కు 96 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 22,936 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పేపర్-2కు 87 కేంద్రాలు ఏర్పాటు చేయగా 20,543 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వివరించారు. పరీక్ష నిర్ణీత సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని పేర్కొన్నారు. పరీక్ష విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్స్తోపాటు అధికారులంతా విధిగా గుర్తింపు కార్డులు ధరించాలన్నారు. అనంతరం పరీక్ష నిర్వహణ, తీసుకోవాల్సిన చర్యలు అంశాలపై శిక్షణ ఇచ్చారు సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.