రామగిరి, మే 21 : ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని ఇంటర్ విద్యాశాఖ ప్రారంభించింది. జంబ్లింగ్ పద్ధతిలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 4.79 లక్షల జవాబు పత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయి. డీఐఈఓ దస్రూ పర్యవేక్షణలో జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్పాట్ వ్యాల్యుయేషన్కు ఏర్పాట్లు చేశారు. జూన్ 10నాటికి ఈ ప్రక్రియ ముగిసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 2,210 మంది అధ్యాపకులు మూల్యాంకనంలో భాగస్వామ్యం కానున్నారు.
ఇప్పటికే సంస్కృతం పేపర్ ప్రారంభం
ఇంటర్ మూల్యాంకనంలో భాగంగా ఈ నెల 12న సంస్కృతం పేపర్ దిద్దే పని ప్రారంభమైంది. సుమారు 7వేల పేపర్లు దిద్దాల్సి ఉండగా ప్రస్తుతం ముగింపునకు వచ్చినట్లు సమాచారం. ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి మూల్యాంకనం ఆదివారం ప్రారంభం కానున్నది. ఇందుకు సంబంధించి చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు ఇప్పటికే రిపోర్ట్ చేశారు. వీరంతా ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు విధుల్లో కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు చెందిన అధ్యాపకులకు మూల్యాంకనం విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు
అందించారు.
నాలుగు విడుతలుగా..
– తొలి విడుతలో ఈ నెల 22 నుంచి తెలుగు, హిందీ, గణితం, పొలిటికల్ సైన్స్, రెండో విడుతలో ఈ నెల 26 నుంచి ఫిజిక్స్ , ఎకనామిక్స్, మూడో విడుతలో ఈ నెల 28నుంచి రసాయనశాస్త్రం, కామర్స్, నాలుగో విడుతలో ఈ నెల 31నుంచి హిస్టరీ, బోటనీ, జువాలజీ పేపర్ల మూల్యాంకనం చేస్తారు.
స్ట్రాంగ్రూమ్ వద్ద పటిష్ట భద్రత
ఇంటర్ మూల్యాంకనం క్యాంపులోని స్ట్రాంగ్రూమ్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు అమర్చారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రక్రియను పూర్తిగా రికార్డింగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు.