బొడ్రాయిబజార్, మే 21: సూర్యాపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ భూములు, తాటి వనాలతో తాళ్లగడ్డగా పిలువబడిన ఓ వార్డు.. ఘనమైన అభివృద్ధి చెంది బంగారుగడ్డగా మారింది. గత ప్రభుత్వాల హయాంలో తాళ్లగడ్డలో ఏ వీధిలో చూసినా గుంతల రోడ్లు, చెత్తకుప్పలు దర్శనమివ్వగా.. విద్యుత్ వెలుగులు లేనే లేవు. నేడు ప్రతి రోడ్డు ప్రధాన రహదారిగా మారి.. విద్య, వైద్యపరంగా ఘనమైన అభివృద్ధిని సాధించింది. దీంతో ప్రజల జీవన విధానం మెరుగుపడి భూముల ధరలు అమాంతం పెరిగాయి. గతంలో అన్నింటా వెనుకబడ్డ తాళ్లగడ్డను ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి దిన దినాభివృద్ధి చేస్తూ బంగారుగడ్డగా మార్చారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ రైతులు, గౌడ కులస్తులు అధిక సంఖ్యలో ఉంటారు. వీరంతా తమ కుల వృత్తులను నిర్వహిస్తుంటారు. ఈ ప్రాంతం మొదట సూర్యాపేట మున్సిపాలిటీలో ఒక వార్డుగా ఉండగా.. వార్డుల పునర్విభజనలో మూడు వార్డులు (27, 28, 29) ఏర్పడ్డాయి. ఈ వార్డులకు చెందిన ప్రజలకు తాళ్లగడ్డ చుట్టు పక్కల వ్యవసాయ భూములు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 9వ నంబర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన 65వ నంబర్ జాతీయ రహదారి ఇక్కడి పంట పొలాల్లో నుంచి వెళ్లడంతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. 65వ నంబర్ జాతీయ రహదారి ఏర్పాటు మొదలు నేటి వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ నుంచి ట్యాంక్బండ్ మీదుగా జనగాం క్రాస్ రోడ్డు వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర వేసిన సీసీ రోడ్డు జిల్లా కేంద్రం నుంచి నేరుగా ఈ మూడు వార్డులను కలుపుకుంటూ వెళుతుంది.
గతంలో ఈ రోడ్డు లేనప్పుడు శంకర్ విలాస్ సెంటర్ నుంచి కోర్టు చౌరస్తా మీదుగా ప్రధాన రహదారి గుండా చుట్టూ తిరిగి జనగాం క్రాస్ రోడ్డుకు వెళ్లాల్సి వచ్చేది. ఈ మూడు వార్డులను కలిపే మరో రోడ్డు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి. ప్రస్తుతం ఈ రహదారిని సుందరీకరిస్తున్నారు. 500 పడకల సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రి, జిల్లాకే తలమానికంగా రూ.200 కోట్లతో 28ఎకరాల్లో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల, ఎంతో మంది విద్యార్థులు విద్యనభ్యసించే ఎస్వీ డిగ్రీ కళాశాల ఈ రహదారి పక్కనే ఉన్నాయి. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డ నుంచి ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల మీదుగా వెళ్లే మరో రహదారి మిర్యాలగూడ బైపాస్. ఈ రహదారి పక్కన ఓ ఇంజినీరింగ్ కళాశాల ఇప్పటికే ఉండగా సుమారు 50 ఎకరాల్లో జిల్లా పోలీసు కార్యాలయం, పరేడ్ గ్రౌండ్ నిర్మిస్తున్నారు. అలాగే బ్రాహ్మణుల అపరశాలను నిర్మించేందుకు ఇటీవల మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇలా తాళ్లగడ్డలో మూడు రహదారుల కలయికతో ముచ్చటగా అభివృద్ధి చెందుతూ బంగారుగడ్డగా మారిందని చెప్పవచ్చు.
అధిక శాతం అభివృద్ధి తాళ్లగడ్డలోనే..
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు అధిక శాతం సూర్యాపేట జిల్లా కేంద్రం ప్రారంభంలో ఉన్న తాళ్లగడ్డలోనే జరుగడం విశేషం. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రానికి తీసుకొచ్చిన మెడికల్ కళాశాల తాళ్లగడ్డలోనే నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. మెడికల్ కళాశాల నిర్మాణానికి ముందు గతంలో తాళ్లగడ్డలో ఉన్న వంద పడకల ఏరియా ఆసుపత్రిని 500 పడకలతో జిల్లా జనరల్ దవాఖానగా అభివృద్ధి చేశారు. దీనికి అనుసంధానంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రం, చిన్నారులకు ఎన్ఐసీయూ సెంటర్, ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అలాగే సూర్యాపేట జిల్లాలోని వివిధ పీహెచ్సీలకు చేరవేసే మెడిసిన్ను అందించేందుకు డ్రగ్ స్టోర్ను తాళ్లగడ్డలోనే ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో తాళ్లగడ్డ మెడికల్ హబ్గా మారనుంది. అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయం, పరేడ్ గ్రౌండ్, పట్టణ ప్రజలకు ప్రతి సాయంత్రం ఆహ్లాదాన్ని పంచే మినీ ట్యాంక్బండ్ కూడా ఈ ప్రాంతంలోనే ఉండడం విశేషం.
భూములకుశరవేగంగా అభివృద్ధి చెందుతున్న తాళ్లగడ్డలో భూములకు భారీ డిమాండ్ పెరిగింది. తాళ్లగడ్డ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు ఇండ్ల స్థలాలుగా మారుతున్నాయి. 2014లో గజం రూ.2 వేలు ఉన్న భూమి ధర నేడు రూ.15 వేల నుంచి 20వేల వరకు పలుకుతుంది. మెడికల్ కళాశాల ఉన్న ప్రధాన రహదారి వెంట గజం విలువ రూ.60వేల పైమాటే.
గత పాలకుల హయాంలో వెనుకబాటు
గత పాలకుల హయాంలో తాళ్లగడ్డ ఆధ్వానంగా ఉండేది. రోడ్లన్నీ గుంతలు, కంపచెట్లతో నిండి.. వీధి దీపాలు లేక అంధకారంగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తాళ్లగడ్డ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ప్రతి వీధిలో సీసీ రోడ్లు వేయడంతోపాటు వీధి దీపాలు, పార్కులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం తాళ్లగడ్డలోనే చేపట్టడం హర్షణీయం. తాళ్లగడ్డను బంగారుగడ్డగా మార్చిన మంత్రి జగదీశ్రెడ్డికి ఈ ప్రాంత ప్రజలంతా రుణపడి ఉంటారు.
– సిరివెళ్ల శబరినాథ్, తాళ్లగడ్డ, సూర్యాపేట
80శాతం అభివృద్ధి తాళ్లగడ్డలోనే..
సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రాష్ర్టానికే తలమానికంగా తీర్చిదిద్దుతున్నారు. పట్టణంలో చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు తాళ్లగడ్డలోనే జరుగుతున్నాయి. జిల్లాకు తలమానికమైన మెడికల్ కళాశాల, ఎర్రకోట తరహాలో నిర్మించిన ఎస్పీ కార్యాలయం, 500 పడకల జిల్లా జనరల్ ఆసుపత్రి, మినీ ట్యాంక్బండ్ ఏర్పాటు వంటివి మా తాళ్లగడ్డలోనే ఉన్నాయి. దీంతో ఇక్కడి భూముల ధరలు కూడా పెరిగాయి. నేను ఇల్లు కట్టినప్పుడు రూ.2వేలు ఉన్న గజం భూమి విలువ ఇప్పుడు రూ.20వేలకు పైగానే పలుకుతుంది. తాళ్లగడ్డను అభివృద్ధి చేసిన మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు.
– కక్కిరేణి నాగయ్య, తాళ్లగడ్డ, సూర్యాపేట