నాగారం, మే 21:మెకానిక్ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ యువకుడు ఓ రోజు వ్యవసాయ కనెక్షన్ మరమ్మతు చేస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. దవాఖానలో చికిత్స పొంది పది లక్షల రూపాయల ఖర్చుతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇద్దరు పిల్లలు, కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భార్య, వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు.. రెండేండ్లుగా ఎటూ కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమై ఆ యువకుడు సాయం చేయాలని చేతులెత్తి కోరుతున్నాడు.
సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన గంట మహేశ్(25) కూలి పనులతో పాటు చిన్నస్థాయి మోటార్ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 2020 ఆగస్టు 26న మహేశ్ కూలి పనికి వెళ్తుండగా తోటి రైతు పిలిచి విద్యుత్ సరఫరాలో అంతరాయం వచ్చిందని, మరమ్మతు చేయాలని కోరాడు. విద్యుత్ సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో వారికి సమాచారం ఇచ్చి ఎల్సీ తీసుకున్నాడు. విద్యుత్ స్తంభం పైకి ఎక్కిన మహేశ్ అదే స్తంభానికి మరింత పైనున్న హైటెన్షన్ లైన్ కారణంగా విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలతో కిందపడిపోయాడు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా రైతులు సూర్యాపేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని చెప్పడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కాళ్లు, చేతులు కాలిపోవడంతో పాటు వెన్నుపూస చచ్చుబడిపోయింది. దాదాపు 6 నెలలుగా ఐసీయూకే పరిమితం కాగా, కుటుంబ సభ్యులు వైద్య చికిత్స కోసం రూ.10లక్షలకు పైగా అప్పు చేసి బతికించుకున్నారు.
నాటి నుంచి మంచానికే పరిమితమైన మహేశ్ను అతడి భార్య కంటికిరెప్పలా చూసుకుంటున్నది. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో బాధితుడి బతుకు దుర్భరంగా మారింది. పనికివెళ్తే కానీ పూట గడువని ఆ కుటుంబం ఇప్పటికీ నెలకు ఐదు వేల రూపాయలు మందులకే ఖర్చుచేస్తూ దిక్కుతోచక రోదిస్తున్నది. ఇద్దరు చిన్న పిల్లలు, కదలలేని భర్త, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో ఆ మహిళ పడుతున్న అవస్థలు ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టిస్తున్నాయి. తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె తన ఇద్దరు చిన్నారులతో వెళ్లి ప్రతి అధికారినీ కలిసి వేడుకుంటున్నది. రెండేళ్లు గడుస్తున్నా ఎవ్వరూ స్పందించకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నది.