మిర్యాలగూడ రూరల్, మే 21 : కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాల్లో పడాలంటే ఈ కేవైసీ (ధ్రువీకరణ) తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు పథకం మాదిరిగానే కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ఏటా మూడు విడుతల్లో రూ.2వేల చొప్పున 6వేలు పంపిణీ చేస్తున్నది. ఇప్పటి వరకు పది విడుతలుగా నగదు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ అయ్యింది. అయితే, ఇక నుంచి ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఖాతాలో డబ్బు జమ కానున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు సోషల్ మీడియా ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 31 వరకు మాత్రమే గడువున్న నేపథ్యంలో రైతులంతా ఈ కేవైసీని పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
నమోదు ఇలా…
ఈ కేవైసీ ధ్రువీకరణ చాలా సులభం. ఆన్లైన్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ సేవ, ఈ సేవ, ఆన్లైన్ కేంద్రాలతో పాటు ఇంట్లోనే ఉండి ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. www.pm kisan.gov.in లింకును ఓపెన్ చేయగానే అందులో ఈ-కేవైసీ అప్డేట్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు ఆధార్ కార్డుకు లింకై ఉన్న మొబైల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే గెట్ పీఎం కిసాన్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మళ్లీ మొబైల్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేస్తే ఈ-కేవైసీ అప్డేట్ అవుతుంది.
విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం
రైతులంతా తప్పని సరిగా ఈకేవైసీని ఈ నెల 31లోగా పూర్తి చేయాలి. మీ సేవ, ఈ సేవ, ఆన్లైన్ కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు. ఈ విషయమై సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. మిర్యాలగూడ మండల పరిధిలో ప్రస్తుతం పది శాతం మంది రైతులు మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేశారు.
– సైదులు, ఏఈఓ, మిర్యాలగూడ