సూర్యాపేట టౌన్, మే 21 : మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని జిల్లా ఆస్పత్రిలోని వివిధ వైద్య విభాగాల అధిపతులు కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో మెడికల్ కళాశాలను నెలకొల్పిన ఆయన అందుకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను సాధించడంతోపాటు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిగా రూపాంతరం చెందిన ఏరియా ఆస్పత్రి స్థానే నూతన భవనాన్ని మంజూరు చేయించడం అభినందనీయమని కొనియాడారు. అంతటితో వదలకుండా పట్టుదలతో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ను మంజూరు చేయించి సూర్యాపేటను మెడికల్ హబ్గా మార్చారని కితాబిచ్చారు. శనివారం ఉదయం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొత్తగా మంజూరైన తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్కు స్థల పరిశీలన చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ దండ మురళీధర్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ శారదతోపాటు వైద్య విభాగాధిపతులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సుజాత, పిల్లల వైద్య విభాగధిపతి డాక్టర్ శ్రీకాంత్భట్, ఆర్థోపెడిక్ విభాగం నుంచి డాక్టర్ వి.శ్రీనివాస్, చర్మ వ్యాధుల విభాగం నుంచి డాక్టర్ భూమేశ్, ఆప్తమాలజీ నుంచి డాక్టర్ రామ్మోహన్లాల్, అనస్తీషియా నుంచి డాక్టర్ గీత, ఈఎస్టీ నుంచి డాక్టర్ అరుణకుమారి, ఇతర వైద్య సిబ్బంది సమీక్షలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ప్రారంభం అనంతరం సూర్యాపేటలో పెరిగిన వైద్య సేవల ప్రస్తావన వచ్చినప్పుడు మంత్రి జగదీశ్రెడ్డి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తమ వెన్నంటి ప్రోత్సహిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నందునే వైద్య రంగంలో సూర్యాపేట పురోగతి సాధించిందన్నారు. పొరుగు ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇక్కడి సేవలు పొరుగు రాష్ర్టాలకూ వ్యాప్తి చెందాయని వైద్య విభాగాధిపతులు పేర్కొన్నారు. అన్నింటికీ మించి సూర్యాపేటలో ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడం అంటే సీఎం కేసీఆర్ దగ్గర మంత్రి జగదీశ్రెడ్డికి ఉన్న చనువు మాత్రమే అని, ఆయన ఆశీర్వాదం ప్రస్తుతం ప్రజలకు ప్రయోజనం చేకూర్చుతుందని పేర్కొన్నారు.
అన్నింటికీ మించి ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గుండెపోటుకు అత్యంత ఖరీదైన మందులు అందుబాటులోకి రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. హిమోపోలియా బారిన పడిన వారికి సైతం వైద్యం అందించే ప్రక్రియ సూర్యాపేట ఆస్పత్రిలో ప్రారంభమైందన్నారు. సెక్టర్-8, 9 వంటి అత్యంత ఖరీదైన మందులు అందిస్తున్నామంటే సీఎం కేసీఆర్ వైద్య రంగంలో పేదలకు ఎంతటి నాణ్యమైన సేవలు అందిస్తున్నారనేందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సరిగ్గా 100 రోజుల క్రితం ప్రారంభమైన స్పెషల్ న్యూబర్న్ కేర్ యూనిట్ 20 పడకలతో విజయవంతంగా సేవలు అందిస్తున్నట్లు వైద్య విభాగాధిపతులు సమావేశంలో మంత్రికి వివరించారు.
విద్య, వైద్యం బలోపేతానికి నిర్ణయం
మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్, నీటి రంగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం వైద్యం, విద్యను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులకు అందిస్తున్న ఆహార ధరలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారిగా రెట్టింపు చేశారన్నారు. హైపోరిటీ, సాధారణ, డయాబెటిస్తోపాటు గర్భిణులకు అందించే ఆహార ధరలను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన విధానంతో పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలిచారని, అవి ఫైనల్ కావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ రోజు ప్రారంభించుకున్నట్లు ఆయన వెల్లడించారు. వైద్య రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను అమలుపరుస్తున్న వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు.