సూర్యాపేట టౌన్, మే 20 : తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్) మండలాల్లో లబ్ధిదారుల దళితబంధు యూనిట్లు ప్రారంభించడంతో పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 72మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ రెండు ప్రజా విద్రోహక పార్టీలేనని, ఆయా పార్టీలు ఎన్నో ఏండ్లు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించినా వాటి వల్ల మన తెలంగాణకు జరిగిన లాభాల కంటే నష్టాలే ఎక్కువని అన్నారు. ఉద్యమ రథసారధి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతో పాటు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తెలంగాణ రూపురేఖలు మారాయన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ చెక్కుల పంపిణీతో ఆడపిల్లల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. దీంతో నాడు ఆడపిల్లలను భారమనుకున్న తల్లిదండ్రులు నేడు అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక విపక్షాలు విషం చిమ్ముతూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఇకనైనా తమ తీరు మార్చుకోకపోతే ప్రజలు మరోమారు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, పార్టీ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ఎంపీపీ బోరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి.భిక్షంతో పాటు కౌన్సిలర్లు, అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిపారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం కాశీతండా చెందిన వివిధ పార్టీల నాయకులు, మహిళలు భారీగా టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి పల్లె, పట్టణం, తండా ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ మర్ల స్వర్ణలత చంద్రారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.